ఉచిత ప‌థ‌కాలలో.. విద్యుత్‌, పెట్రోల్‌, గ్యాస్‌

ఉచిత ప‌థ‌కాలతో పేరుతో ఇప్ప‌టికే అమ‌లు అవుతున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌గా వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్నేలా మ‌రో భారీ మేనిఫెస్టో విడుద‌ల అయింది. కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీ అయిన స‌మాజ్ వాదీ త‌ర‌ఫున సంచ‌ల‌న హామీలు ఇచ్చారు ఆ పార్టీ ర‌థ‌సార‌థి అఖిలేశ్ యాద‌వ్‌. విద్యుత్‌, పెట్రోల్‌, గ్యాస్‌, ఎరువులు ఇలా కీల‌క అవ‌స‌రాలు ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు అఖిలేశ్ ఆల్ ఫ్రీ మేనిఫెస్టోలో వెల్ల‌డించారు.

పార్టీ నేత‌ల‌తో క‌లిసి స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ తాజాగా యూపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. 300 లోపు యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని అఖిలేశ్ హామీ ఇచ్చారు. దారిద్య్ర రేఖ‌కు దిగువన కుటుంబాల‌కు ఏడాది రెండు సార్లు ఉచితంగా ఎల్పీజీ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. బైక్ న‌డిపించే వారికి ప్ర‌తి నెలా ఒక‌సారి ఉచితంగా పెట్రోల్ అందిస్తామ‌ని, ఆటో న‌డిపించే వారికి మూడు లీట‌ర్ల పెట్రోలు, లీట‌ర్ సీఎన్‌జీ గ్యాస్ ఉచితంగా ఇస్తామ‌ని త‌మ‌ మేనిఫెస్టోలో అఖిలేశ్ ప్ర‌క‌టించారు.

ఇక రెండెక‌రాల భూమి ఉన్న వారికి రెండు డీఏపీ బ‌స్తాలు, 5 యూరియా బ‌స్తాలు కూడా ఉచితంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌హిళ‌లు, వృద్ధులు, విక‌లాంగుల‌కు ఏడాదికి 18 వేలు పింఛ‌న్ ఇస్తామ‌ని అఖిలేశ్ ప్ర‌క‌టించారు. కీల‌క‌మైన రైతుల విష‌యంలో అఖిలేశ్ భారీ హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల‌కు 25 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట ప‌రిహారాన్ని చెల్లిస్తామ‌ని అఖిలేశ్ ప్ర‌కటించారు.

రైతు పండించే పంట‌ల‌న్నింటికీ క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వ‌చ్చేలా చూస్తామ‌ని, చెరుకు రైతులు పంట అమ్మిన 15 రోజుల్లోగా డ‌బ్బు వ‌చ్చేలా చూస్తామ‌ని కూడా స‌మాజ్‌వాదీ త‌న మేనిఫెస్టోలో పొందుప‌రిచారు. 2025 క‌ల్లా రైతుల‌ను రుణ విముక్తుల‌ను చేస్తామ‌ని అందులో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వ‌స్తే ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తామ‌ని తెలిపారు. స‌మాజ్‌వాదీ క్యాంటీన్ల‌ను తెరుస్తామ‌ని, 10 రూపాయల‌కే భోజ‌నాన్ని ఇస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.