మ‌రో వందేళ్ల‌కు కూడా కాంగ్రెస్ బ‌తుకు ఇంతే: మోడీ

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాజాగా నిప్పులు చెరిగారు. నిజానికి గ‌త ఆరు మాసాలుగా ఆయ‌న సైలెంట్‌గా ఉన్నారు.కానీ, ఇప్పుడు పార్ల‌మెంటు వేదిక‌గా కాంగ్రెస్‌ను క‌డిగేశారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మ‌రో వందేళ్ల‌కు కూడా కాంగ్రెస్ బ‌తుకు ఇంతేన‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

“ఈరోజు దేశంలోని పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ లభిస్తోంది. ఇళ్లు, శౌచాలయాలు లభిస్తున్నాయి. సొంతంగా బ్యాంకు ఖాతాను ఉపయోగించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొందరి(కాంగ్రెస్ నేత‌లు) ఆలోచనలు 2014లోనే ఉండిపోయాయి. బంగాల్, అసోం, తమిళనాడు, ఛత్తీస్గఢ్ వంటి పలు రాష్ట్రాలు కాంగ్రెస్ను ఎప్పుడో మర్చిపోయాయి. తెలంగాణ ఇచ్చామని మీరు చెప్పుకుంటారు. కానీ అక్కడి ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు. ఝార్ఖండ్ ఏర్పడి 20 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ అక్కడ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయారు. పరోక్ష మార్గంలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా మీ(కాంగ్రెస్) అహంకారం మాత్రం తగ్గలేదు“ అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

వచ్చే వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాము కూడా వందేళ్ల వరకు అధికారంలో ఉండేందుకు సిద్ధంగా ఉంటామని చురకలు అంటించారు. “మీరు నన్ను వ్యతిరేకించవచ్చు. కానీ ఫిట్ ఇండియా పథకాన్ని, ఇతర పథకాలను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడినప్పుడు మీరు నన్ను విస్మరిస్తారు. మోడీ చెప్పారు కాబట్టి ఆ పదాన్నే పలకకూడదని మీరు అనుకుంటారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని మహాత్మా గాంధీనే స్వయంగా చెప్పారు“ అని అన్నారు.

“మహాత్మా గాంధీ కలను నెరవేర్చేందుకు మీరు(కాంగ్రెస్) ఎందుకు కృషి చేయడం లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఏళ్ల నుంచి ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో ఇక్కడే అర్థమవుతోంది. తర్వాతి వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉంటాం“ అని తీవ్ర ఆవేశంతో ప్ర‌ధాని మోడీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు గడిచినా కొందరి తీరు మాత్రం మారలేదని మోడీ వాగ్బాణాలు సంధించారు. కరోనాపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేసిందని విమర్శించారు. నిజానికి ఇప్ప‌టి వ‌రకు ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని ఈ రేంజ్‌లో కాంగ్రెస్‌పై దూకుడు వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి తాజా వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.