టార్గెట్లో ‘ఆ నలుగురు’

ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలకు ఆ నలుగురు టార్గెట్ గా మారినట్లు అర్ధమవుతోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే పీఆర్సీ సాధన సమితి పేరుతో మంత్రుల కమిటితో చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి. మొదటిసారి మంత్రుల కమిటితో చర్చించి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కూడా వీళ్ళు నలుగురే టార్గెట్ అయ్యారు.

పిట్మెంట్ విషయం మాత్రమే అప్పట్లో జగన్ తో మాట్లాడారు. మిగిలింది చీఫ్ సెక్రటరీతో మాట్లాడమని జగన్ అంటే నేతలు నలుగురు సరే అన్నారు. ఆ సందర్భంలోనే జగన్ కు జై కొట్టి సమావేశం నుంచి బయటకు వచ్చారు. అయితే చీఫ్ సెక్రటరితో సమావేశం తర్వాత ఏమి జరిగింది, ఉద్యోగులు ఈ నలుగురు నేతలపై ఎలా మండిపడ్డారో అందరికీ తెలిసిందే. దాంతో ఉద్యోగుల ఒత్తిడికి లొంగిన ఈ నలుగురు మళ్ళీ ఆందోళనలకు పిలుపిచ్చారు. చివరకు ఛలో విజయవాడ కార్యక్రమం కూడా  జరిగింది.

మొన్నటి శనివారం ఈ నలుగురే మంత్రుల కమిటితో చర్చలు జరిపి మళ్ళీ జగన్ తో భేటీ అయి జై కొట్టి బయటకొచ్చారు. వెంటనే ఆదివారం నుండే ఈ నలుగురిపై గోల మొదలైంది. తాజాగా ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఈ నలుగురిపైన మండిపోతున్నారు. పీఆర్సీ సాధన సమితి నిర్ణయాలను తప్పుపడుతూ ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు రోడ్డెక్కటం గమనార్హం.  తిరుపతిలాంటి కొన్ని చోట్ల ఈ నలుగురి దిష్టిబొమ్మలను ఉపాధ్యాయ సంఘాల స్థానిక నేతలు తగలబెట్టారు.

వీళ్ళకు మద్దతుగా ఉపాధ్యాయ ఎంఎల్సీలు కూడా డైరెక్టుగానే రంగంలోకి దిగేశారు. కొన్ని ప్రాంతాల్లో పై నలుగురి ఫొటోలకు దండలేసి నివాళులర్పిస్తున్నారు. ఆందోళన, సమ్మెబాట నుంచి వెనక్కు తగ్గదంటు ఉపాధ్యాయులను ఎంఎల్సీలు ప్రోత్సహిస్తున్నారు. ఉపాధ్యాయులు చేసే పోరాటాల్లో తాము కూడా పాల్గొంటామని ఉపాధ్యాయ ఎంఎల్సీలు ప్రకటించటం గమనార్హం. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఉపాధ్యాయుల ఆందోళనకు మద్దతు పలికారు. మొత్తానికి ఆ నలుగురిపైన ఉన్న మంట కారణంగా ఉపాధ్యాయుల ఆందోళనల్లో రాజకీయలు కూడా జొరబడుతున్నట్లే ఉంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.