రాజీనామాకు రెడీ: బాల‌య్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ కీల‌క నాయ‌కుడు, న‌టుడు బాల‌కృష్ణ‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఉన్న హిందూపురం ప్రాంతాన్ని కొత్త‌గా ఏర్ప‌టు చేయ‌నున్న శ్రీస‌త్య‌సాయి జిల్లాకు కేంద్రంగా చేయాల‌ని కోరుతూ.. తాజాగా బాల‌య్య  రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న మౌన దీక్ష చేప‌ట్టారు. హిందూపురంలో పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లిన బాలకృష్ణ.. అంబేడ్కర్ విగ్రహం మౌన దీక్ష చేపట్టారు. దీక్షా స్థలానికి బాలయ్య అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకున్నారు.

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు స్థానికంగా మార్మోగుతున్నాయి. అంతకుముందు సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాలంటూ బాలకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బాలకృష్ణ వెంట భారీగా పార్టీ శ్రేణులతోపాటు అఖిలపక్ష సభ్యులు , విద్యార్థులు, యువకులు తరలివచ్చారు.

పార్టీలకు అతీతంగా బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ నినదించారు. ఉద్యమ కార్యాచరణపై సాయంత్రం అఖిలపక్ష నేతలతో బాలకృష్ణ చర్చించనున్నారు. మ‌రోవైపు బాలకృష్ణ నివాసం వద్ద కార్యకర్తలు, నాయకులు, అభిమానుల తాకిడితో సందడి వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా ఆలిండియా ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. హిందూపురాన్ని శ్రీస‌త్యసాయి జిల్లాకు కేంద్రంగా ప్ర‌క‌టించ‌క‌పోతే.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు… ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధించి.. ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని అన్నారు. మ‌రి ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.