జగన్ పీఆర్సీ చిక్కుముడిలో చిక్కుకుపోయారెలా?

ముడులు వేయటం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ.. వేసిన ముడులను విప్పదీయటం అంత సులువు కాదు. అలాంటిది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం భిన్నమని చెబుతారు. ఒక సమస్య మీద పడినప్పుడు.. మరో సమస్యను తెర మీదకు తీసుకురావటం.. కొత్త సమస్య ముడిని వేసి.. పాత సమస్య ముడిని విప్పే విచిత్రమైన టాలెంట్ ఆయన సొంతం.

సాధారణంగా ఒక సమస్య మీద పడినప్పుడు.. దాని నుంచి బయటపడి.. కొంతకాలం పాటు సమస్యలు ఏమీ లేకుండా చూసుకోవాలి అన్న తపన కనిపిస్తుంది. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు మాత్రం ఇందుకు భిన్నమని చెబుతారు. గడిచిన రెండున్నరేళ్ల జగన్ పాలన చూసినప్పుడు ఆయన తీరు విలక్షణంగా ఉండటమే కాదు.. మరే ముఖ్యమంత్రికి లేని ఆత్మవిశ్వాసం ఆయనలోనూ.. ఆయన టీంలోనూ కనిపిస్తుంటుంది.

తమకు బాగా అలవాటైన ఆటను ఆడే విషయంలో అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంటారు. ఇప్పుడు అలాంటి తప్పటడుగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో పడిందని చెప్పాలి. తన చేతికి ఎముక ఉండదని అందరూ తనను అంటుంటారని.. ఉద్యోగులు కోరుకున్న దాని కంటే మిన్నగా పీఆర్సీ ఉంటుందని చెప్పి.. ప్రభుత్వానికి ఉన్న సంకటాలను కూడా పరిగణలోకి తీసుకొని పెద్ద మనసుతో వ్యవహరించాలని సీఎం జగన్ కోరిన వైనం గుర్తుండే ఉంటుంది. ఇదంతా చూసిన ప్రజలకు జగన్ మీద సానుభూతి పొంగి పొర్లితే.. ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యతిరేకత వ్యక్తమైంది.

ఏపీ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. జీతాలు పెంచుకునే విషయం మీద ఏపీ ఉద్యోగులు అత్యాశపరులు గా ప్రజల మదిలో నిలిచారు. కానీ.. ఎప్పుడైతే ప్రస్తుత జీతాల కంటే కొత్త పీఆర్సీ కారణంగా తక్కువ జీతం వస్తుందన్న విషయాన్ని ఉద్యోగులు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తొలిసారి ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమైంది.తాను వేసే ఎత్తు.. తనకు చేటు కలిగేలా చేస్తుందన్న సందేహం వచ్చినంతనే.. జగన్ అండ్ కోకు చెందిన స్లీపింగ్ సెల్స్ ఒక్కసారిగా యాక్టివ్ అవుతాయి. తాజా ఎపిసోడ్ లోనే చూస్తే.. ప్రభుత్వ ఉద్యోగుల వెనుక రాజకీయ పక్షం ఉందనో.. వారిని తప్పు దోవ పట్టించే వ్యవహారం మరేదో జరిగిందని కానీ.. ఇలా ఏదో ఒక ఇష్యూ తెర మీదకు వచ్చి.. అసలు పీఆర్సీ ఎపిసోడ్ పక్కకు వెళ్లాల్సింది.

కానీ.. ఈసారి అలా జరగకపోవటం గమనార్హం. దీనికి తోడు జగన్ సర్కారు కారణంగా.. తమకు వచ్చే కొత్త జీతాల కారణంగా ఏడాది మొత్తంలో తగ్గేది ఎంతన్న విషయాన్ని గణాంకల రూపంలో వాట్సాప్  మెసేజ్ లు సిద్దం చేసి యుద్ధ ప్రాతిపదికన షేర్ చేయటం.. అవి కాస్తా వైరల్ కావటం కూడా జగన్ సర్కారుకు ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. తనకు అలవాటైన ఆటలో భాగంగా.. పీఆర్సీ ఎపిసోడ్ విషయాన్ని చూస్తే.. ఉద్యోగులు అడుగుతున్న పాత జీతాల్ని ఇచ్చే విషయాన్ని తెర మీదకు రాకుండా.. గొంతెమ్మ కోర్కెల్ని కోరుతున్నారన్న భావన ఎక్కువగా కలిగేలా చేసేవాళ్లే. 
కానీ.. అలాంటి ప్రచారాలకు అవకాశం ఇవ్వకుండా ఉద్యోగులు తమ వాదనను సూటిగా.. స్పష్టంగా.. అందరికి అర్థమయ్యేలా చేయటంతో ప్రజలకు ఏం జరుగుతుందన్నది అర్థమైంది.

దీనికి తోడు.. ప్రభుత్వం కొత్త జీతాల కారణంగా రూ.10వేల కోట్లు అదనపు భారం పడుతుందని ప్రభుత్వం చెబుతున్న వాదనకు ధీటైన కౌంటర్ ఇస్తూ.. కొత్త జీతాలతో రూ.10వేల కోట్ల భారం అదనంగా పడుతుందని అంటున్నారు కదా? మాకు కొత్త జీతాలు వద్దు.. పాత జీతాలే ముద్దు అన్న ఉద్యోగుల వాదనకు ప్రజలు ఇట్టే కనెక్టు అయ్యేలా చేసింది.
 దీనికి సరైన సమాధానం ఇవ్వడం లో వైఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు..ఇష్యూ మీద వారికి ఉన్న కంట్రోల్ ను సడిలేలా చేసింది. ఒకదాని మీద మరొక ముడి వేసి.. తనకు ఎప్పుడు ఏ ముడి విప్పదీయాలన్న విషయం మీద ఫుల్ క్లారిటీ ఉన్న జగన్.. తాజా ఎపిసోడ్ లో ఈ ఇష్యూలో రెండు మూడు తలల్ని దూర్చి.. ఇష్యూ కంగాళీ చేయటమే కాదు.. తాను వేసిన చిక్కుముడుల్లో తానే చిక్కుకుపోయారు. మరి… ఇది ఎపుడు ఎలా విప్పుకుంటారో, ఉద్యోగుల తమ పోరాటం ఎలా ఆపుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.