అండర్ గ్రౌండ్లోకి ఉద్యోగ నేతలు

ఛలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేయటంలో భాగంగా ఉద్యోగుల నేతలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయటానికి పోలీసులు ఉద్యోగుల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకోవటం, హౌస్ అరెస్టులు చేశారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవటంలో భాగంగా పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్ రెడ్డి తదితరులు అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు.

ఎట్టి పరిస్ధితుల్లోను పోలీసులకు తాము దొరక్కూడదన్న ఉద్దేశ్యంతోనే కీలక నేతలంతా తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వాళ్ళ ఇళ్ళల్లోను, అసోసియేషన్ కార్యాలయాల్లో కానీ లేరు. అలాగే తమ మొబైల్ ఫోన్లను కూడా స్విచ్చాఫ్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళు నలుగురు నేతలు ఒకటే చోటున్నారా ? లేకపోతే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారా అన్న విషయం కూడా తెలీటంలేదు. కమ్యూనికేషన్ కోసమని తమ మొబైల్ ఫోన్లను కాకుండా వేరే నెంబర్లు వాడుతున్నట్లు సమాచారం.

ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాగే జిల్లాల నుండి ఎవరూ విజయవాడకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. ఉద్యోగులకు గురువారం నాడు ఎంతో అవసరమైతే తప్ప సెలవులు ఇవ్వద్దని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అయినా కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులు సెలవులు అడిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా ? గురువారం ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనదలచిన ఉద్యోగులంతా ఏదో కారణంతో సెలవుపెట్టేసి ఏదో మార్గంలో విజయవాడకు చేరుకుంటారు.

మొత్తం మీద ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘాల నేతలకు మొదలైన వివాదం బాగా పెరిగిపోతోంది. ఒకవైపు కోర్టు కూడా ఉద్యోగుల సమ్మె విషయంలో అసంతృప్తి వ్యక్తంచేసింది. కోర్టులో కేసు వేసిన ఉద్యోగులు మళ్ళీ సమ్మె ఎలా చేస్తారంటు నిలదీసింది. అయినా ఉద్యోగులు కోర్టును పట్టించుకోవటంలేదు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయటమే తమ టార్గెట్ గా ఉద్యోగ నేతలు పావులు కదుపుతున్నారు. మొత్తం మీద నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారే సూచనలైతే కనబడుతున్నాయి. చివరకు ఏమవుతుందో చూడాలి.