మ‌మ‌త సీటుకు కేసీఆర్ ఎస‌రు..!

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ సీటుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎస‌రు పెట్టారా..? అంటే రాజ‌కీయ వ‌ర్గాలు అవున‌నే స‌మాధాన‌మిస్తున్నాయి. మ‌మ‌త సీటుకు కేసీఆర్ ఎస‌రు పెట్ట‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. కేసీఆర్ టార్గెట్ చేసింది మ‌మ‌త సీఎం సీటును కాదు.. దేశ రాజ‌కీయాల్లో ప్ర‌తిప‌క్షాల‌ను ఏకం చేసే ప్ర‌ధాన పాత్ర‌పై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఇన్ని రోజులు ఆ స్థానంలో మ‌మ‌తా బెన‌ర్జీ ఉన్నారు. ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు.

నిన్న కేంద్ర బ‌డ్జెట్ లో రాష్ట్రానికి స‌రైన కేటాయింపులు లేక‌పోవ‌డంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని క‌డిగేశారు కేసీఆర్‌. మోదీ నుంచి బండి సంజ‌య్ వ‌ర‌కు ఆ పార్టీ నేత‌ల‌ను నానా తిట్లు తిట్టారు. ఇక బీజేపీ నేత‌ల‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేద‌ని తానే ఢిల్లీలో ఎంట్రీ ఇస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఇక కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామ‌ని.. యుద్ధానికి సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో సీఎం కేసీఆర్ మ‌రోసారి దేశ రాజ‌కీయాల వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు తేట‌తెల్లం అయ్యింది.

బ‌డ్జెట్ లో ఏ వ‌ర్గానికి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. వ్య‌వ‌సాయంతో పాటు అన్ని వ‌ర్గాల‌ను విస్మ‌రించార‌ని కేసీఆర్ ఆరోపించారు. మోదీ ప్ర‌భుత్వానికి దేశ ప్ర‌గ‌తిపై స‌రైన ప్ర‌ణాళిక లేద‌ని నిప్పులు చెరిగారు. దీని కోసం రాజ్యంగాన్ని మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అది జ‌ర‌గాలంటే దేశానికి ప‌ట్టిన ద‌రిద్రం పోవాల‌ని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా థ‌ర్డ్ ఫ్రంట్ ఆవిర్భ‌వించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తేల్చి చెప్పారు. దాని కోసం తానే ఢిల్లీలో మొద‌టి అడుగు వేస్తాన‌ని.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌లుపుకొని పోతాన‌ని చెప్పుకొచ్చారు.

అయితే కేసీఆర్ చెప్పినంత‌గా సులువు కాదు ఢిల్లీ రాజ‌కీయాలు చేయ‌డం. బీజేపీ, కాంగ్రెస్ ల‌కు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో కూట‌మి క‌ట్టాలంటే ఎంతో శ్ర‌మించాల్సి ఉంది. అందుకే అంద‌రి కంటే ముందుగా ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయాలని.. యాంటీ మోడీ ఫేస్ గా గుర్తింపు పొందిన ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని స్థానాన్ని ఆక్ర‌మించాల‌ని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కేంద్ర బ‌డ్జెట్ పై బీజేపీకి వ్య‌తిరేకంగా సోనియా, రాహుల్‌, స్టాలిన్‌, మ‌మ‌త‌, శ‌ర‌ద్ ప‌వార్‌, అఖిలేశ్ ఇత‌ర ప్ర‌ధాన నేత‌ల కంటే ముందే స్పందించారు.

గ‌తంలో బీజేపీతో స‌ఖ్య‌త‌గానే ఉన్నారు కేసీఆర్‌. పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, సాగు చ‌ట్టాల‌కు కేంద్రానికి మ‌ద్ద‌తు తెలిపారు. ఇటీవ‌ల ధాన్యం కొనుగోళ్ల అంశం నుంచి త‌న రూటు మార్చారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ఇత‌ర ప‌క్షాల‌తో సంప్ర‌దింపుల కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. తొలుత త‌మిళనాడు వెళ్లి స్టాలిన్ తో స‌మావేశం అయ్యారు. ఇటీవ‌ల‌ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో క‌మ్యూనిస్టు పార్టీల‌తో భేటీ అయి వారి మ‌ద్దతు కోరారు. ఆ త‌ర్వాత బీహార్ కు చెందిన తేజ‌స్వి యాద‌వ్ తో చ‌ర్చ‌లు జ‌రిపారు.

త్వ‌ర‌లో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ థాక‌రే తో స‌మావేశం కానున్నారు. ఇలా దేశంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌ను క‌లుపుకొని బ‌ల‌మైన థ‌ర్డ్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అన్నీ అనుకూలిస్తే ఇక్క‌డ కేటీఆర్ కు ప‌గ్గాలు అప్ప‌గించి కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌నున్నారు. భ‌విష్య‌త్తులో కేసీఆర్ ఆశ‌లు ఏమేర‌కు నెర‌వేర‌తాయో వేచి చూడాలి.