తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు… కేసీఆర్ గేమ్?

తెలంగాణ రాజ‌కీయాలను గ‌మ‌నిస్తున్న వారిలో గ‌త కొద్దికాలంగా వినిపిస్తున్న ప్ర‌చారం… రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు రానున్నాయ‌ని, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌న్న‌ది స‌ద‌రు చ‌ర్చ సారాంశం. అయితే, ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు టీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా మ‌న‌సులో ఉన్న మాట ఏంటో తెలియ‌ని ప‌రిస్థితి.

అయితే, ఈ విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వ‌యంగా త‌న ఆలోచ‌నను పంచుకున్నారు. తెలంగాణ‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బ‌డ్జెట్ పై స్పందిస్తున్న సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని రాజ‌కీయాల గురించి సైతం స్పందించారు. రాష్ట్రంలో ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని కేసీఆర్ తెలిపారు.

103 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో పాలన నడుస్తోందని తెలిపారు. ఎవరో ఏదో అన్నారని కాకుండా.. మా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కేసీఆర్ ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే మెజార్జీసీట్లు సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తామని కూడా కేసీఆర్ జోస్యం చెప్పారు.

రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపు, పైగా సీట్ల సంఖ్య‌తో స‌హా చెప్ప‌డం వెనుక ఉన్న‌ ధీమా గురించి సైతం కేసీఆర్ త‌న ఆలోచ‌న‌లు పంచుకున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం. త‌మ దగ్గర మంచి మత్రం ఉందన్నారు. “గ‌తంలో 8 నెలల ముందు అసెంబ్లీని డిజాల్వ్ చేశాం.. ఇప్పుడు ఆరునెలల ముందు క్యాండిడేట్లకు టికెట్లు అనౌన్స్ చేస్తాం..ఫరక్ ఏం పడదు. గెలుపు మాదే.  ఇది నామాటగా వంద శాతం రాసుకోండి` అని కూడా మీడియాకు కేసీఆర్ హిత‌బోధ చేశారు.