ఎక్స్‌గ్రేషియా వద్దు.. వాడ్ని నడిరోడ్డు మీద ఉరి తీయాలి

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య ఉదంతం.. విన్న వారందరి కంట కన్నీరు కార్పిస్తోంది. స్థానిక రాజకీయ నేతగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా.. అపార్ట్ మెంట్ పెద్ద మనిషిగా వ్యవహరించే వినోద్ జైన్ అనే కామపిశాచి దాహానికి పద్నాలుగేళ్ల చిన్నారి బలైంది. ఈ దారుణం షాకింగ్ గా మారటమే కాదు.. ఇలాంటి నీచుడ్ని అంత తేలికగా వదలకూడదన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న బాలిక తల్లి అనురాధ మాట్లాడుతూ.. తన కుమార్తె గురించి చెప్పిన వివరాల్ని విన్నంతనే అయ్యో.. అన్న ఆవేదన కలుగక మానదు.

మా బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నాం.. ఇప్పటివరకు బిడ్డ రక్తపు చుక్క కూడా చూడలేదు. చదువులో నా బిడ్డ టాపర్. మల్టీ టాలెంటెడ్. ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు పాప ఏడ్చింది. అడిగితే.. మిమ్మల్ని మిస్ అవుతున్నానని బాధ పడింది.  ఆత్మహత్య చేసుకునే రోజు సాయంత్రం చివరిసారి నాతో మాట్లాడింది. అమ్మ ఐలవ్యూ అంటూ రెండు సార్లు పిలిచి.. గట్టిగా హగ్ చేసుకుంది. అప్పటికే ఐదు పేజీల సూసైడ్ నోట్ నా బిడ్డ రాసుకుంది. టుడే ఈజ్ లాస్ట్ డే.

డెత్ డే అంటూ సూసైడ్ నోట్లో రాసింది. ఎవరో ఒక పాప బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయిందని చెప్పటంతో వెళ్లి చూశాం. చివరకు మా అమ్మాయి చనిపోయింది. నా చిట్టి తల్లి ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన వినోద్ జైన్ను నడిరోడ్డులో ఎన్ కౌంటర్ చేయలి. అప్పుడే నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది’’ అంటూ తన అక్రోశాన్ని వ్యక్తం చేసింది.
మనమరాలి వయసున్న చిన్నారిని దారుణంగా వేధించిన వినోద్ జైన్ ను శిక్షించాలని.. ఏ తల్లికీ తమలాంటి గర్భశోకం కలగకూడదంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకుంటామని.. తమకు ఎలాంటి ఎక్స్ గ్రేషియా అక్కర్లేదని.. మరో బిడ్డకు ఇలాంటి గతి పట్టకూడదని వాపోయారు.

మా పాపకు న్యాయం చేయాలన్న ఆ తల్లిదండ్రుల ఆవేదన చూస్తే.. మనసంతా విషాదంతో నిండిపోతుంది. ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు.. ఎక్స్ గ్రేషియాను ప్రకటించటం తెలిసిందే. అయితే.. తమకు అలాంటివేమీ అక్కర్లేదని.. తమ బిడ్డ చావుకు కారణమైనోడిని కఠినంగా శిక్షించాలన్న పాప తల్లి చేసిన డిమాండ్ ను పలువురు సమర్థిస్తున్నారు. డబ్బుతో అన్ని తిరిగి రావు.. కానీ..కఠినమైన శిక్షల్ని తక్షణం విధించటం ద్వారా.. నేరం చేయాలనే వారిలో వణుకు పుడుతుందన్నది మర్చిపోకూడదు. మరి.. ఈ ఉదంతంలో జగన్ సర్కారు ఏం చేస్తుందో చూడాలి.