కేసీఆర్ `పార్ల‌మెంటు వ్యూహం` కేంద్రంపై గ‌ర్జ‌నేనా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఇటీవ‌ల కాలంలో బీజేపీపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగిస్తోందంటూ.. కేసీఆర్.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై ఒంటికాలిపై లేస్తున్నారు. త‌నే స్వ‌యంగా ధ‌ర్నాలు చేయ‌డం.. త‌న పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల‌ను కూడా రంగంలోకి దించ‌డం .. వంటివి తెలిసిందే. అయితే.. ఇప్పుడు కేంద్రంపై మ‌రింత యుద్ధం చేసేందుకు కేసీఆర్‌కు ఛాన్స్ వ‌చ్చింది. అదే.. సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతున్న బ‌డ్జెట్ స‌మావేశాలు. ఈ క్ర‌మంలో కేంద్రంపై మ‌రింత వేడి పెంచేలా కేసీఆర్ వ్యూహాలు రెడీ చేసుకున్న‌ట్టు ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల టాక్‌

ముఖ్యంగా 5 ప్ర‌ధాన అంశాల‌ను కేసీఆర్ త‌న పార్టీ ఎంపీల‌కు నూరి పోస్తున్నారు. వాటిపై కేంద్రంతో ఎంత వ‌ర‌కైనా వెళ్లి పోరాడాలని ఆయ‌న చెబుతున్న‌ట్టు తెలిసింది. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఆదివారం టీఆర్ ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ప్రగ తిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్‌లో భేటీ జరగనుంది. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సీఎం ఖరారు చేయనున్నారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేయనున్నారు. రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపైనా కేసీఆర్‌ సూచనలు, ఆదేశాలు జారీ చేయనున్నారు.ఈ క్ర‌మంలో కేంద్రంపై కొట్లాడ‌డానికే సీఎం మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్రం తీసుకునే ఏ నిర్ణ‌యానికైనా.. అడ్డు ప‌డాల్సిందే అనే విధంగా కేసీఆర్ త‌న పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే పార్టీ పార్ల‌మెంట‌రీ నేత, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు సైతం రెండు రోజులుగా సీఎంతో ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో మొత్తం 5 అంశాల‌ను కేసీఆర్.. నామా నాగేశ్వ‌ర‌రావు, కేకేల‌తో చ‌ర్చించార‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారం. వీటిపై ఖ‌చ్చితంగా పోరాటానికి దిగాల్సిందేన‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు నాన్చుతూ వున్న స‌మ‌స్య‌ల‌పై కూడా పార్ల‌మెంటు వేదిక‌గా నిల‌దీయాల‌ని.. లేక‌పోతే.. రాష్ట్రంలో తాము బ‌ద్నాం అవుతామ‌ని కూడా సీఎం స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆ 5 అంశాల‌పైనే ప్ర‌ధానంగా టీఆర్ ఎస్ ఎంపీలు.. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లలో కేంద్రాన్ని నిల‌దీయ నున్నార‌ని తెలుస్తోంది.

1. ధాన్యం కొనుగోలు:  రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్రం వివ‌క్ష చూపిస్తోంద‌ని.. కొన్నాళ్లుగా ఆరోపిస్తున్న కేసీఆర్.. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌త్య‌క్ష పోరుకు సిద్ధ‌మ‌య్యారు. త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిని పార్ల‌మెంటులో ప్ర‌స్తావించాల‌ని ఆయన ప్ర‌ధానంగా కోరుతున్నారు.

2. నీటి స‌మ‌స్య‌:  రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న నీటి వివాదంపై కేంద్రం జోక్యం చేసుకుని ప‌రిష్క‌రించాల‌ని.. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ద‌న్నుగా నిల‌వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. దీనిపై కూడా ఎంపీల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

3. విభ‌జ‌న హామీలు:  రాష్ట్రం విడిపోయి.. దాదాపు 8 ఏళ్లు అయిపోయినా.. ఇప్ప‌టివ‌ర‌కు విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను కేంద్రం ప‌ట్టించుకోలేద‌ని.. వాటిని ప‌రిష్క‌రించాల‌ని.. ముఖ్యంగా ఎయిమ్స్ స‌హా .. ఇత‌ర కేంద్ర సంస్థ‌ల‌ను కేటాయించే విష‌యంలోనూ వివ‌క్ష చూపుతోంద‌ని.. కేసీఆర్ త‌ర‌చుగా అంటున్నారు. వీటిపై కూడా పార్ల‌మెంటులో నిల‌దీయ‌నున్నారు.

4. ఐఏఎస్‌ల స‌వ‌ర‌ణ:  రాష్ట్రాల్లో ప‌నిచేస్తున్న ఐఏఎస్ అధికారుల‌ను తాము కోరిన వెంట‌నే కేంద్రానికి ఇచ్చేయాల‌న్న కేంద్రం ప్ర‌తిపాద‌న‌ను ఇప్ప‌టికే కేసీఆర్ ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. అయిన‌ప్ప‌టికీ.. కేంద్రం ముందుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈ విష‌యాన్ని కూడా బ‌లంగా ప్ర‌స్తావించి..కేంద్రాన్ని ఇరుకున పెట్టాల‌ని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

5. నిధుల కేటాయింపు:  రాష్ట్రంలో చేప‌ట్టే కేంద్ర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. త‌ర‌చుగా కేసీఆర్‌, ఆయ‌న కుమారుడు కేటీఆర్ కూడా నిల‌దీస్తున్నారు. సోమ‌వారం ప్ర‌వేశ పెట్టే బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గ‌క‌పోతే.. వాటిపై నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. కేంద్రాన్ని ప్ర‌శ్నించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.