పీకే కాంగ్రెస్‌లో ఎందుకు చేర‌లేదంటే: ప్రియాంక‌

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌కు దేశ రాజ‌కీయాల్లో మంచి పేరుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్, త‌మిళ‌నాడులో స్టాలిన్‌, ప‌శ్చిమ బెంగాల్‌లో మూడోసారి మ‌మ‌త బెన‌ర్జీని సీఎం చేయ‌డంలో ఆయ‌న‌ది కీల‌క పాత్ర‌. రాజ‌కీయాల‌పై అంత‌టి అవ‌గాహ‌న ఉన్న పీకే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేశారు. కొంత‌కాలంగా తెర‌వెన‌క ఉండి వివిధ పార్టీల‌ను న‌డిపించిన ఆయ‌న‌.. నేరుగా ముందుకు వ‌చ్చి కాంగ్రెస్‌లో చేరాల‌నే ప్ర‌య‌త్నాలు చేసిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌తో కూడా ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. కానీ చివ‌ర‌కు కాంగ్రెస్‌లో చేర‌డం లేద‌ని పీకే పేర్కొన్నారు.

దీంతో అస‌లు పీకే కాంగ్రెస్‌లో చేర‌క‌పోవ‌డం వెన‌క కార‌ణం ఏమై ఉంటుంద‌నే ప్ర‌శ్న రేకెత్తింది. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జీ ప్రియాంక గాంధీ దానికి స‌మాధాన‌మిచ్చారు. యూపీలో ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసిన సంద‌ర్భంగా విలేక‌ర్ల ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త పీకే గ‌తేడాది కాంగ్రెస్‌లో చేరేవారే. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాలేదు. కొన్ని విషయాలపై మాకు ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ఆయ‌న‌ చేరికపై చర్చలు ముందుకెళ్లలేదు’ అని తెలిపారు. అయితే బయటి వ్యక్తిని కాంగ్రెస్ లోకి తేవడంపై తాను విముఖంగా ఉన్న ట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

2017 యూపీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పీకే ప‌ని చేసిన‌ప్ప‌టికీ అక్క‌డ పార్టీకి దారుణ‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. దీంతో అప్పటి నుంచి పార్టీ ఆయ‌న్ని దూరం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే దేశ రాజకీయాల్లో మోడీకి ప్ర‌త్యామ్నాయంగా  కూట‌మి ఏర్పాటు చేసే దిశ‌గా సాగుతున్న కాంగ్రెస్ అందుకు పీకే స‌ల‌హాలు తీసుకుంటుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అంతే కాకుండా ఆయ‌న కాంగ్రెస్‌లో చేర‌డం దాదాపు ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లూ వినిపించాయి. కానీ అది కుద‌ర‌లేదు. కాంగ్రెస్‌లో చేరాల‌కున్న పీకే.. రాజ‌కీయ స‌ల‌హాదారు ప‌ద‌విని ఆశించార‌ని అది ఇవ్వ‌డానికి సోనియా గాంధీ విముఖ‌త ప్ర‌ద‌ర్శించార‌నే ప్ర‌చారం సాగింది. అందుకే ఈ పార్ట‌లో చేరే విష‌యంపై ఆయ‌న వెన‌క‌డ‌గు వేశార‌ని నిపుణులు అంటున్నారు.

కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకుని ప‌రిస్థితులు క‌లిసి రాక‌పోవ‌డంతో వెన‌క్కి త‌గ్గిన పీకే.. ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని వెన‌కుండి న‌డిపిస్తున్నారని టాక్‌. మోడీని గ‌ద్దె దించేందుకు కాంగ్రెస్ సార‌థ్యంలో ఏర్పాటు చేసే విప‌క్ష కూట‌మిలో చేరేందుకు మ‌మ‌త సిద్ధంగా లేరు. ఆ కూట‌మిని న‌డిపించే సామ‌ర్థ్యం కాంగ్రెస్‌కు లేద‌ని ఆమె బ‌హిరంగంగానే పేర్కొన్నారు. మోడీకి తానే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని భావిస్తున్న ఆమె ఇత‌ర రాష్ట్రాల్లోనూ పాగా వేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో త‌న వ్యూహాలు, ప్ర‌ణాళిక‌ల‌తో పీకే.. మ‌మ‌త‌కు అండ‌గా ఉంటున్నార‌ని స‌మాచారం.