నియామకం తర్వాత చట్ట సవరణా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఇందుకు తాజాగా హైకోర్టులో చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే బోర్డులో 29 మంది సభ్యులున్నారు. వీరు కాకుండా మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులివ్వటమే కాకుండా నియామకాలు కూడా చేసింది. దాన్ని కోర్టులో సవాలు చేశారు.

దేవాదాయ చట్టంలో అసలు ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావనే లేదని పిటిషనర్ చెప్పారు. కాబట్టి ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని వాదించారు. బోర్డు సభ్యుల నియామకం తప్ప ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు లేదని పిటీషనర్ తరపు లాయర్ వాదించారు. ఇదే విషయమై ప్రభుత్వం తరపు లాయర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రభుత్వం చట్ట సవరణ చేయబోతోందని చెప్పారు.

ఇక్కడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రభుత్వ నిర్ణయం తప్పని అర్ధమైపోతోంది. ప్రత్యేక ఆహ్వానితులను నియమించాలని అనుకుంటే ముందుగా చట్ట సవరణ చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం నియామకాలు చేయాలి. అంతేకానీ ముందు నియామకాలు చేసేసి తర్వాత ఎప్పుడో చట్ట సవరణ చేస్తామని చెప్పటమే విడ్డూరం. ఇపుడు కూడా కోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి, విచారణ జరుగుతోంది కాబట్టే చట్ట సవరణ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు పట్టించుకోకపోతే చట్ట సవరణ ఉద్దేశ్యమే ప్రభుత్వానికి ఉండేదికాదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుంది ప్రభుత్వం తీరు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కోర్టులు కేసులు పడేట్లుగా ప్రభుత్వమే కొన్నిసార్లు అవకాశం ఇస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఏ నిర్ణయమైనా న్యాయసమీక్షకు నిలబడేట్లుగా ఉండాలన్న కనీస ఇంగితం లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటవుతుందంటే కుదరదు. కాబట్టి నిర్ణయాలు తీసుకునేముందే జాగ్రత్త పడితే అందరికీ మంచిది.