YSRCP: ఈసారి అవకాశం ఎవరికి దక్కుతుందో ?

తొందరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల్లో వైసీపీ తరపున ఎవరికి అవకాశం వస్తుందనే విషయంలో పార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేపు జూన్ మాసంతో ఏపీలోని నలుగురు ఎంపీలు రిటైర్ అవుతారు. విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభు పదవీకాలం ముగిసిపోతుంది. వీరిలో విజయసాయి వైసీపీ తరపున ఇఫ్పటికే రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. సుజనా, టీజీ వెంకటేష్, సురేష్ ముగ్గురు టీడీపీ కోటాలో రాజ్యసభకు ఎంపికయ్యారు.

వీరి ముగ్గురిలో సుజనా, టీజీ ఇద్దరు టీడీపీ నేతలైతే 2016 నాటి పరిస్ధితుల కారణంగా బీజేపీ నేతైన సురేష్ ప్రభును ఏపి నుంచి టీడీపీ కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయాల్సొచ్చింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తర్వాత సుజనా, టీజీ కూడా టీడీపీలో నుంచి బీజేపీలోకి ఫిరాయించారు. సరే ఏ విషయం ఎలాగున్నా పై నలుగురి పదవీకాలం ముగిసిపోతోంది. వీరిలో విజయసాయికి మళ్ళీ రెన్యువల్ వస్తుందనే అనుకుంటున్నారు.

ఇపుడున్న ఆరుగురిలో పరిమళ్ నత్వానీ కాకుండా ముగ్గురు రెడ్లు, ఇద్దరు బీసీలున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారమైతే ఈసారి బీసీలకు అవకాశం ఉండదట. ఎందుకంటే ఇప్పటికే బీసీ కోటాలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. కాబట్టి భర్తీ చేయబోయే మిగిలిన మూడు సీట్లలో ఒకటి కాపులకు, ఇంకోటి మహిళకు మరోటి ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ మూడు వర్గాలను కూడా మూడు ప్రాంతాల నుండి ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు.

కాపులు,  మహిళలు, మైనారిటిల కోటాలో భర్తీ చేయబోయే నేతల పేర్లను జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్లు సమాచారం. తిరుగుబాటు ఎంపీ రఘురామరాజు రాజీనామా చేస్తే ఉపఎన్నిక వస్తుంది. నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో రాజులు, కాపుల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాపులకు ప్రాతినిధ్యం విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇపుడు కూడా అదే పద్దతి పాటించనున్నారు.