చార్టెడ్ ఫ్లైట్ లకు అనుమతివ్వాలని జగన్ లేఖ

Jagan

మహమ్మారి వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేయడానికి భారత్ తో పాటు పలు దేశాలలో లాక్ డౌన్ విధించడంతో వేలాది మంది విదేశాలలో చిక్కుకుపోయారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, పర్యాటకం…తదితర కారణాలతో లాక్ డౌన్ లో విదేశాల్లో భారతీయులు చాలామంది ఉండిపోయారు.

వీరందరినీ స్వదేశాలకు తరలించేందుకు కేంద్రం….వందే భారత్ మిషన్ చేపట్టింది. వందే భారత్ మిషన్ లో భాగంగా విమానాల ద్వారా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశాలకు కేంద్రం తరలిస్తోంది. ఇందులో భాగంగా విదేశాల్లో ఉన్న పలువురు తెలుగు వారు ఏపీకి, తెలంగాణకు వస్తున్నారు. అయితే, చార్టెడ్ విమానాలకు మాత్రం కేంద్రం అనుమతివ్వలేదు.

దీంతో, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. మరిన్ని వందే భారత్ విమానాలను నడిపి ఏపీ వాసులను తీసుకురావాలని విన్నవించారు. ప్రవాసాంధ్రులను రప్పించేందుకు విమానాల సంఖ్యను పెంచడంతో పాటు చార్టెడ్ ఫ్లైట్ లకు అనుమతినివ్వాలని కోరారు.

కిర్గిజ్ స్థాన్, కతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ తదితర దేశాల్లో చాలామంది తెలుగు వారు చిక్కుకుపోయారని జగన్ తెలిపారు. ఆయా దేశాల నుంచి ఏపీకి చార్టెడ్ ఫ్లైట్స్ ను అనుమతించాలని ప్రవాసాంధ్రులు కోరుతున్నాయని చెప్పారు. వందే భారత్ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ లను సాదరంగా ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ చాలా గొప్పదని జగన్ ప్రశంసించారు. విమానాల సంఖ్య పెంచడం, చార్టెడ్ ఫ్లైట్ లను అనుమతించడం ద్వారా మరింత వేగంగా….మరింత మందిని స్వరాష్ట్రాలకు తరలించవచ్చని జగన్ అన్నారు.