కుప్పంలో ఆప‌రేష‌న్ క్లీన‌ప్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరులోని కుప్పంలో పార్టీని సంస్క‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఆప‌రేష‌న్ క్లీన్ అప్ పేరుతో కుప్పంలో పార్టీని గాడిలో పెట్టే ప‌నిచేప‌ట్టారు. ముఖ్యంగా ఇప్ప‌టి వ‌ర‌కుఉన్న నాయ‌కుల‌ను న‌మ్మి తాను మోస‌పోయాన‌ని చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు కొత్త‌గా మ‌ధ్య‌స్థాయి నేత‌ల‌ను, నాయ‌క‌త్వాన్నితీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు. ఒక్క కుప్పంలోనే కాకుండా.. అన్ని ముఖ్య నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ చంద్ర‌బాబు.. పార్టీని గాడిలో పెట్టే చ‌ర్య‌లుచేప‌ట్టారు.

అయితే.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. మ‌రింత దృష్టి పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సాధారణంగా.. కుప్పంకు చంద్ర‌బాబు ఎప్పుడు వ‌చ్చినా.. కీల‌క నాయ‌కులు.. బాబు పీఏ మ‌నోహ‌ర్‌, మునిర‌త్నం, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, గౌరివాని త‌దిత‌రులు ఆయ‌న వెంటే ఉండేవారు. కానీ, గ‌త సారి కుప్పంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు. ఈ నేత‌లు.. డుమ్మా కొట్టారు. దీనికి కార‌ణం.. పార్టీని భ్ర‌ష్టు పట్టిస్తున్నార‌నే కార‌ణంగా..ఈ నేత‌ల‌ను పార్టీ రోజు వారి కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాలంటూ.. చంద్ర‌బాబు ఆదేశించిన‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనేఏపీ మ‌నోహ‌ర్‌, మునిర‌త్నం, త్వ‌ర‌లోనే రిజైన్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనికి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మి కార‌ణంగా క‌నిపిస్తోంది. వాస్త‌వానికి మ‌నోహ‌ర్‌ను త‌క్ష‌ణ‌మేపార్టీ నుంచి వెళ్లిపోవాల‌ని ఆదేశించార‌ని.. కానీ, ఆయ‌న ప్ర‌త్యామ్నాయం చూసుకునే వ‌ర‌కు కొన‌సాగుతాన‌ని కోరిన‌ట్టు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వారిని వ్యూహాత్మ‌కంగానే ప‌క్క‌న పెట్టార‌ని స‌మాచారం. ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు.. పార్టీ కుప్పంలో ఓట‌మిత‌ర్వాత .. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు మ‌రో ఆలోచ‌న చేస్తున్నార‌ని అంటున్నారు. కుప్పం నియ‌జ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డిని నియ‌మించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. క్షేత్ర‌స్థాయిలో పార్టీ గురించి తెలిసిన నాయ‌కుడు, రాజ‌కీయంగా సీనియ‌ర్ కావ‌డంతో ఆయ‌న పార్టీని మ‌రోసారి వ్యూహాత్మ‌కంగా డెవ‌ల‌ప్ చేస్తార‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. మ‌రి మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్ రెడ్డి చంద్ర‌బాబు ఆశ‌ల‌ను ఏమేర‌కు స‌ఫ‌లీకృతం చేస్తారో చూడాలి.