జగన్‌కు మళ్లీ సుప్రీం కోర్టు పంచ్

కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం చాలా మామూలు విషయం అయిపోయింది ఏపీ సర్కారుకు. రాష్ట్ర హైకోర్టులో ఏడాది కాలంలో ఏకంగా 60 సార్లకు పైగా మొట్టికాయలు వేయించుకున్న ఘనత జగన్ సర్కారుదే. అయినా ఆయనేమీ వెనక్కి తగ్గట్లేదు. కోర్టుల్లో నిలబడవని తెలిసినా కొన్ని నిర్ణయాల్లో ఆయన ముందుకెళ్లిపోతున్నారు. ఈ మధ్య ఆయనకు సుప్రీం కోర్టులో సైతం ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసిన విషయమై ఇటీవలే జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇప్పుడు మరోసారి సర్వోన్నత న్యాయస్థానం ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కారు వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

ఈ కేసులో ఏపీ సర్కారు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. కానీ రమేష్ కుమార్‌ను తొలగించేందుకు తెచ్చిన ఆర్డినెన్స్, జీవోలను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి మాత్రం సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఏపీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్‌ను పక్కన పెట్టాలని హైకోర్టు ఆదేశించడంతో రమేష్ కుమార్ తిరిగి సీీఈసీగా బాధ్యతలు చేపట్టడానికి రెడీ అయ్యారు. కానీ అందుకు జగన్ సర్కారు అంగీకరించలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి.. ఆయనకు బ్రేక్ వేయాలని చూసింది. ఇప్పుడు అక్కడా ఎదురు దెబ్బ తగలడంతో ప్రభుత్వం ఏమీ చేయడానికి లేకపోయింది. రమేష్ కుమార్ తిరిగి సీఈసీ కావడం లాంఛనమే అని న్యాయ నిపుణులు అంటున్నారు. మరి ఆయనకు అడ్డు కట్ట వేయడానికి జగన్ సర్కారు ఇంకే మార్గం వెతుకుతుందో చూడాలి.