తెలంగాణ.. ఇండియా మొత్తంలో లాస్ట్

Corona In Telangana
Corona In Telangana

కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పోరాడుతోందని ఊదరగొట్టేశారు. చివరికి చూస్తే ఇక్కడ పరిస్థితులు అనేక సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. మొన్న కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన టీవీ5 జర్నలిస్టు మనోజ్ కుమార్ ఉదంతం ఇందుకో ఉదాహరణ. అతడికి అప్పటికే అనారోగ్య సమస్యలున్నాయి. అలాంటపుడు వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణ అవసరం.

కానీ అతణ్ని గాంధీ ఆసుపత్రిలో సరిగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అందరిలో ఒకడిగా చూశారు. తీసుకెళ్లి కామన్ బెడ్స్ ఉన్న చోట పడేశారు. అక్కడ సరైన వసతుల్లేవని.. ఆక్సిజన్ కూడా పెట్టడం లేదని వాట్సాప్‌లో పరిస్థితి విషమించడానికి ఒక్క రోజు ముందు మనోజ్ చేసిన చాట్ తాలూకు స్క్రీన్ షాట్స్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటిచెబుతున్నాయి.

ఈ రోజు గాంధీలో సరైన సౌకర్యాలు, రక్షణ ఏర్పాట్లు లేవంటూ అక్కడి వైద్యులు ఆందోళన బాట పట్టారు. సౌకర్యాలు, సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో పేషెంట్ల ప్రాణాల మీదికి వచ్చి వాళ్లు తమ మీద దాడి చేస్తుండటం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో కరోనా పరీక్షలు అతి తక్కువగా చేస్తుండటం పట్ల సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ పది శాతం టెస్టులు కూడా చేయకపోవడం షాకిచ్చే విషయం. ఈ విషయంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వ తీరులో మార్పు లేదు. మరోవైపు దేశంలో ప్రజారోగ్యం మీద అతి తక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అంటూ తాజాగా ఒక సమాచారం బయటికి వచ్చింది.

దీని గురించి కాంగ్రెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్లో వెల్లడించారు. 2015-20 మధ్య వార్షిక బడ్జెట్లో ప్రజారోగ్యం మీద తెలంగాణ ఖర్చు చేసిన మొత్తం 4.4 శాతం మాత్రమే అంటూ ఆయన ఒక అఫీషియల్ గ్రాఫ్‌ను షేర్ చేశారు. దేశం మొత్తంలో బడ్జెట్లో ఆరోగ్యం మీద ఇంత తక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రం మరొకటి లేదు. బీహార్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రం కూడా 4.5 శాతంతో తెలంగాణ కంటే కాస్త మెరుగైన స్థానంలోనే ఉంది. ఢిల్లీ 13 శాతంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీన్ని బట్టి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే విషయంలో తెలంగాణ ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు.