మోడీ భేటీతో ఏపీకి మరో అప్పు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో.. తొలి రోజున ప్రధాని నరేంద్ర మోడీని కలవటం.. ఆ సందర్భంగా ఆయన పాత డిమాండ్లను సరికొత్తగా ఆయన ముందు పెట్టటం.. వాటిని పరిశీలిస్తానని చెప్పటం.. అదే విషయం మీడియాలో రావటం తెలిసిందే. మోడీతో సీఎం జగన్ భేటీ తర్వాత ఏం జరిగింది? అన్న విషయానికి వస్తే..

ఏపీకి రూ.2500 కోట్ల కొత్త అప్పునకు ఓకే చెప్పటమే కాదు.. గంటల వ్యవధిలోనే ఏపీకి ఆ మొత్తం సర్దుబాటు అయ్యింది.
సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం జగన్ కలిసిన తర్వాత.. కొత్త అప్పునకు ఓకే చెప్పటంతో మంగళవారం యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. ఉదయాన్నే ఆర్బీఐలో బాండ్లు.. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా రూ.2500 కోట్ల అప్పు తీసుకొచ్చింది.

నిజానికి జగన్ ఢిల్లీకి రాక ముందు.. ఏపీ ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు విపరీతంగా ప్రయత్నించినా కొత్త అప్పునకు ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన సీఎం.. అనుకున్నట్లే రూ.2500కోట్ల అప్పును సాధించగలిగారు. మొత్తానికి రాష్ట్రం చేతికి వచ్చిన రూ.2500 కోట్ల కొత్త అప్పును దేనికి వినియోగించారు? అన్న విషయంలోకి వెళితే.. ఆ వివరాలు తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. రూ.2500 కోట్లలో కొంత మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్టు కింద ఆర్ బీఐ జమ చేసుకోగా.. మిగిలిన డబ్బుతో పెన్షనర్లకు పెన్షన్లు.. ఉద్యోగుల జీతాల్ని కొంతమేర సర్దుబాటు చేయగలిగారు.

గడిచిన 8 రోజుల్లో ఏపీ ప్రభుత్వం మొత్తంగా రూ.4750 కోట్ల అప్పు చేసింది. ఈ లెక్కన చూసినప్పుడు రోజుకురాష్ట్ర ప్రభుత్వం రూ.594 కోట్ల మొత్తాన్ని అప్పు చేస్తున్నట్లుగా చెప్పాలి. క్యాలెండర్ లో నాలుగో తేదీ దాటినా.. ఉద్యోగులు.. పెన్షనర్లకు ప్రభుత్వం ఇంకా రూ.3200 కోట్లమేర బకాయిలు ఉంది. అవ్వాతాతల పింఛన్ల కోసం డబ్బుల్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. మరేం చేస్తారో చూడాలి. ఇలా.. ఎప్పటికప్పుడు అప్పులు చేస్తూ.. జీతాలు.. పెన్షన్లు.. ఫించన్లను ఇచ్చుకుంటూ పోతే.. రాష్ట్రాన్ని డెవలప్ చేసేందుకు అవసరమైన నిధుల్ని ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? అన్నది అసలైన ప్రశ్నగా మారింది.