AP: ఒక్కటి మాత్రం చెప్పటం లేదా?

ఎన్నిచర్చలు జరిగినా, ఎన్నిసార్లు బేటీలు జరిగినా ఆ ఒక్కటి మాత్రం ఉద్యోగసఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయటంలేదు. ఇంతకీ ప్రభుత్వం బయటకు చెప్పని ఆ ఒక్కటి ఏమిటయ్యా అంటే ఫిట్మెంట్. మొదటినుండి పీఆర్సీ ప్రకటన అంశం ఫిట్మెంట్ దగ్గరే పీటముడి పడుంది. ప్రభుత్వమేమో ఫిట్మెంట్ ను 14.29 శాతంగా గట్టిగా పట్టుబట్టుంది. దీనికి ఉద్యోగసంఘాల నేతలు ఎంతమాత్రం అంగీకరించటంలేదు.

నేతలేమో ఫిట్మెంట్ ను 50 శాతం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. ఈ రెండు ఫిట్మెంట్ శాతాల దగ్గర చాలా తేడా ఉంది. మామూలుగా అయితే ఇంత తేడా ఉండదు. కానీ ఇఫుడు ఏకంగా 36 శాతం తేడా కనబడుతోంది. ఉద్యోగసంఘాల నేతలు ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం 14.29 శాతం దాటి వచ్చేట్లు కనబడటంలేదు. అలాగే ఉద్యోగసంఘాల నేతలు కూడా తమ డిమాండ్ మీదే పట్టుబట్టి కూర్చున్నారు.

చివరకు గురువారం జరిగిన సమావేశంలో కూడా అసలు ఫిట్మెంట్ ఎంతిద్దామని ప్రభుత్వం అనుకుంటోందో రెండో ఫిగర్ చెప్పమని నేతలు నేరుగానే ప్రశ్నించారు. అయితే ఎలాంటి ఫిగర్ చెప్పకుండానే ఉన్నతాధికారులు సమావేశాన్ని ముగించేశారు. ఇపుడు జరుగుతున్నది చూస్తుంటే ఫిట్మెంట్ మహాఅయితే 20 శాతంకన్నా మించేట్లు లేదు. దీనికి ఆర్ధికపరిస్దితిని కారణంగా ఉన్నతాధికారులు కారణంగా చూపిస్తున్నారు.

ఒకవైపేమో నేతలు జగన్మోహన్ రెడ్డితోనే భేటీ ఏర్పాటు చేయమని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అదేమో సాధ్యం కావటంలేదు. నిజానికి ఈ విషయాన్ని తెగేదాక లాగటం ప్రభుత్వానికి ఏమాత్రం మంచిదికాదు. వేరేదారి లేక ప్రభుత్వం చెప్పినట్లు ఉద్యోగసంఘాల నేతలు అంగీకరించినా రేపు సమయం వచ్చినపుడు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం చేసే ప్రమాదముంది.

గతంలో ప్రభుత్వాలు ఉద్యోగసంఘాల నేతలు చెప్పినట్లు విన్నమాట వాస్తవం. అయితే అప్పటి రాష్ట్ర ఆర్ధికపరిస్ధితి వేరని గుర్తుంచుకోవాలి. పరిస్ధితులు ఏవైనా తమ డిమాండ్లు నెరవేర్చుకోవటమే నేతలకు ప్రధానంగా ఉంటుంది. ఇందుకనే వారితో ఘర్షణాత్మక వైఖరితో కాకుండా వారిని కన్వీన్స్ చేసేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. అంతిమంగా ఉద్యోగుల సహకారం లేకుండా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేందు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పీఆర్సీని వివాదాన్ని ముగించటం అందరికీ మంచిది.