ష‌ర్మిల పార్టీలో మ‌ళ్లీ ముస‌లం

YSRTPPP

ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం అన్నార‌ట వెనుకటికి ఒక‌రు. ఇప్ప‌డు తెలంగాణ‌లో కూడా అలాగే ఉంది వైఎస్సార్‌టీపీ ప‌రిస్థితి. ఆ పార్టీకి ఒక సిద్ధాంత‌మంటూ లేదు.. ఒక నిర్మాణ‌మంటూ లేదు.. అప్పుడే పార్టీలో గొడ‌వలు జ‌రిగిపోతున్నాయ‌ట‌. వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయ‌ట‌. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది విన‌డానికి కామెడీగా ఉన్నాఆ పార్టీలో ప్ర‌స్తుతం ఇదే జ‌రుగుతోంది.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వైఎస్ఆర్‌టీపీలో గొడ‌వ‌లు ముదిరాయి. హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. ఆ పార్టీకి చెందిన ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డిని స‌స్పెండ్ చేసిన‌ట్లు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి జ‌ల్లేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర్లు ప్ర‌క‌టించారు. ఈ విష‌య‌మై ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టింగులు చేసిన‌ట్లు అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. దీనికి ప్ర‌తిగా, మొన్న‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న‌ ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డి వ‌ర్గీయులు జ‌ల్లేప‌ల్లికి వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టారు. దీంతో పార్టీ పెద్ద‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.

ఇంత‌కుముందు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆదెర్ల‌కు… ఇటీవ‌ల పార్టీలోకి కొత్త‌గా వ‌చ్చిన జ‌ల్లేప‌ల్లి వెంక‌టేశ్వ‌ర్లు మ‌ధ్య ఆధిప‌త్య పోరు జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు బీజేపీలో ఉన్న జ‌ల్లేప‌ల్లి ఈ మ‌ధ్య‌నే వైఎస్సార్‌టీపీలో చేరారు. వ‌చ్చీ రాగానే జాక్‌పాట్ కొట్టారు. పార్టీ అధినేత ష‌ర్మిల ఆదెర్ల‌ను తొల‌గించి జ‌ల్లేప‌ల్లిని నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి, పార్టీ అధికార ప్ర‌తినిధిగా నియ‌మించారు. దీంతో నొచ్చుకున్న ఆదెర్ల పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

అయితే.. ఇటీవ‌ల ష‌ర్మిల జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి జ‌ల్లేప‌ల్లి కొత్త పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించి.. వైఎస్సార్ విగ్ర‌హానికి పాల‌భిషేకం చేసి రోగుల‌కు పండ్లు పంపిణీ చేశార‌ట‌. దీనికి ప్ర‌తిగా పాత పార్టీ కార్యాల‌యంలో కేక్ క‌ట్ చేశార‌ట ఆదెర్ల‌. ఇలా పోటాపోటీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంతో పార్టీ అధిష్ఠానం సీరియ‌స్ అయ్యింద‌ట‌. ఆదెర్ల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని జ‌ల్లేప‌ల్లిని ఆదేశించింద‌ట‌. దీనిపై ఆదెర్ల శ్రీ‌నివాస్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కుడిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే అధికారం ఎవ‌రికీ లేద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఇలా పార్టీలో అప్పుడే కోల్డ్ వార్ న‌డుస్తుండ‌డంపై పార్టీ పెద్ద‌లు ఆందోళ‌న‌గా ఉన్నార‌ట‌. పార్టీ బ‌లంగా ఉంద‌ని అనుకుంటున్న న‌ల్ల‌గొండ జిల్లాలోనే ఇలా ఉంటే.. మిగ‌తా జిల్లాల్లో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయోన‌ని కార్య‌క‌ర్త‌లు కూడా అనుమాన‌పు చూపులు చూస్తున్నార‌ట‌. అస‌లు ఇంత‌కీ ఈ పార్టీని తెలంగాణ ప్ర‌జ‌లు ఆంధ్రా పార్టీగానే చూస్తున్నారు. ఇందిరా శోభ‌న్ వంటి కీల‌క నేత‌లు పార్టీని వీడారు. ఇక‌పై పార్టీని ఎలా ముందుకు తీసుకెళ‌తారో చూడాలి.