వివాదంగా మారిన మూడు రాజ‌ధానుల స‌భ‌

తిరుప‌తిలో తాజాగా జ‌రుగుతున్న మూడు రాజ‌ధానుల(వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్దతుగా) స‌భ జ‌రుగుతోంది. రాయ‌ల‌సీమ మేధావుల ఫోరం నేతృత్వంలో ఈ స‌భ సాగుతోంది. అయితే.. ఇది ఆది నుంచి వివాదంగా మారింది. అనేక ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. మ‌రి దీనికి కార‌ణాలు ఏంటి? ఎందుకు వివాదంగా మారింది? అనేది ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేయ‌డాన్ని నిర‌సిస్తూ.. ఇక్క‌డి రైతులు.. 700 రోజ‌లకు పైగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే.. వారు అనేక రూపాల్లో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు.. ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.

ఇక‌, ఈ క్ర‌మంలో ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేసి..రాష్ట్రం మొత్తాన్ని క‌దిలించాల‌నే సంక‌ల్పంతో.. న్యాయ‌స్థా నం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించి స‌క్సెస్ చేశారు. రైతుల పాద‌యాత్ర‌కు అడుగ‌డు గునా.. ప్ర‌జ‌లు ప్రాంతాల‌కు అతీతంగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో రైతుల‌కు.. వ్య‌తిరేకంగా.. రాయ‌ల సీమ మేధావుల ఫోరం గ‌ళం వినిపించింది. త‌మ ప్రాంతాలు అభివృద్ధి చెంద‌న‌క్క‌ర లేదా.. అమ‌రావ‌తిలోనే వేల కోట్ల సంప‌ద పోగుప‌డాలా? అంటూ.. ఇక్క‌డి మేధావులు ఒక ఫోరంగా ఏర్ప‌డి.. రైతులు నిర్వ‌హించిన మ‌హాస‌భ‌కు ప్ర‌తిగా.. పోటీగా.. తాము కూడా స‌భ నిర్వ‌హిస్తున్నారు.

మూడు రాజ‌ధానులు కావాల్సిందేన‌ని.. క‌ర్నూలును న్యాయ‌రాజ‌ధాని చేయాల్సిందేన‌ని.. విశాఖ రాజ‌ధాని గా ఉండాల్సిందేన‌ని..అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధాని చేయాల్సిందేనని.. నాయ‌కులు గ‌ళం వినిపిస్తున్నా రు. అయితే.. ఇప్పుడు నిర్వ‌హిస్తున్న ఈ వికేంద్రీక‌ర‌ణ స‌భ‌పై అనేక ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. శ‌నివారం తిరుప‌తి వేదిక‌గానే నిర్వ‌హించిన స‌భ‌కు భారీ ఎత్తున మ‌హిళ‌ల‌ను.. విద్యార్థిను ల‌ను త‌ర‌లించారు. అయితే.. వారు ఎందుకు వ‌చ్చారో.. విష‌యం ఏమిటో.. అస‌లు మూడు రాజ‌ధానుల విష‌యంపై ఎంత అవ‌గాహ‌న ఉంద‌నేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఈ స‌భ‌కు వ‌చ్చిన మ‌హిళ‌లు చిత్ర‌మైన స‌మాధానాలు చెప్పారు.  

“స‌భ సంగ‌తి మాకు తెలీదు. ర‌మ్మ‌న్నారువ‌చ్చాం“ అని ఎక్కువ మంది మ‌హిళ‌లు స‌మాధానం చెప్పారు. ఇక‌, మ‌రికొంద‌రు.. `మేం డ్వాక్రా స‌భ్యులమండి. మా లీడ‌ర్ ర‌మ్మంది వ‌చ్చాం.“ అని స‌మాధానం ఇచ్చారు. ఇక‌, మెప్మాలో ప‌నిచేసేవారు.. మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానం ఇచ్చారు. “మేం రాక‌పోతే.. రూ.500 క‌ట్టాల‌ని.. మా సార్ హెచ్చ‌రించాడు. ఏం చేస్తాం. ఇప్పుడున్న ప‌రిస్తితిలో.. 500 క‌ట్టలేం. ఇక్క‌డ‌కు వ‌స్తే.. బిర్యానీ పెడ‌తామ‌ని.. రాను పోను ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు ఇస్తామ‌ని.. మ‌స్ట‌ర్ వేస్తామ‌ని చెప్పారు అందుకే వ‌చ్చాం“ అని స‌మాధానం ఇచ్చారు.

ఇక‌, విద్యార్థినుల విష‌యానికి వ‌స్తే.. వారు కూడా త‌మ‌ను ఇక్క‌డకు  ఎందుకు త‌ర‌లించారో తెలియ‌ద‌ని.. కానీ.. `ఇది మీ కోస‌మే.. రాక‌పోతే.. కాలేజీలో సీటు పోతుంది!“ అని హెచ్చ‌రించిన‌ట్టు తెలిపారు. మ‌రికొంద‌రు మ‌హిళ‌లు.. డ్వాక్రా స‌భ‌లు నిర్వ‌హిస‌స్తున్నార‌ని.. స‌భ‌కు రుణాలు ఇస్తార‌ని.. ఆశ పెట్టార‌ని.. అందుకే వ‌చ్చామ‌ని.. చెప్పుకొచ్చారు. ఇలా.. దాదాపు 90 శాతం మంది ఎందుకు వ‌చ్చార‌నే ప్ర‌శ్న‌కు ఇలానే స‌మాధానాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే.. వీరంతా కూడా అమరావ‌తికే జై కొట్ట‌డం మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం.  అందుకే.. ఈ స‌భ వివాదంగా మారింద‌ని అంటున్నారు.. ప‌రిశీల‌కులు.