వివాదంలో ప్రధానమంత్రి కార్యాలయం

నరేంద్రమోడి కార్యాలయం సరికొత్త వివాదంలో ఇరుక్కుంది. ఎన్నికల సంస్కరణల విషయాన్ని చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి రావాల్సిందిగా చీఫ్ ఎన్నికల కమీషనర్+ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కేంద్ర న్యాయశాఖ మంత్రి కార్యాలయం లేఖ రాసిందనే విషయంపై వివాదం పెరుగుతోంది. నవంబర్ 16న జరిగినట్లుగా చెబుతున్న సమావేశం వివరాలు ఇపుడు బయటకు పొక్కటంతో ప్రతిపక్షాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయంపై మండిపోతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. ఈ వ్యవస్థ కేవలం రాష్ట్రపతికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. ప్రధానమంత్రి సమావేశానికి రావాలని పిలిచినా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలు, చేపడుతున్న సంస్కరణలను ప్రధానమంత్రికి రిపోర్టు రూపంలో తెలిపితే సరిపోతుంది.

ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సొస్తే ప్రధానమంత్రి తరపున కీలకమైన అధికారులు ఎన్నికల కమిషనర్ ఆఫీసుకు వచ్చి చీఫ్ ఎన్నికల కమిషనర్ లేదా ఎన్నికల కమీషనర్లతో భేటీ అవుతారంతే. ఎన్నికల తేదీలను కూడా స్వతంత్రంగానే ప్రకటించే అధికారం కమీషన్ కు ఉంది. అయితే ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ యంత్రాంగమే పాల్గొనాలి కాబట్టి వారి అవైలబిలిటీ, ఇబ్బందులను గమనించేందుకు ముందుగా ప్రభుత్వంతో చెప్పిన తర్వాతే తేదీలను కమిషన్ ఫైనల్ చేస్తుంది.

ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే చీఫ్ ఎన్నికల కమిషనర్ + కమీషనర్లు గట్టిగా ఉన్నపుడు. లేకపోతే ప్రధానమంత్రి కార్యాలయం చెప్పినట్లే అందరు నడుచుకుంటారనటంలో సందేహమే లేదు. ఇపుడు జరుగుతున్నదిదే. ఈ విషయంపైనే ప్రతిపక్ష నేతలంతా ప్రధానమంత్రి కార్యాలయంపై మండిపోతున్నారు. ఎన్నికల కమిషన్ను పీఎంవో నియంత్రించటం ఏమిటంటు ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తుతున్నారు.

ఇదే విషయమై గతంలో చీఫ్ కమీషనర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ప్రధానమంత్రి కార్యాలయాన్నే తప్పుపడుతున్నారు. పనిలో పనిగా చీఫ్ ఎన్నికల కమీషనర్+కమీషనర్ల వ్యవహారశైలిని కూడా తప్పుపడుతున్నారు. పీఎంవోకు ఇంతగా ఎందుకు లొంగిపోయి పనిచేస్తున్నారంటు నిలదీస్తున్నారు. అయితే తమపై వస్తున్న ఆరోపణలను కమీషన్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. న్యాయ మంత్రిత్వ శాఖతో కమీషన్ వర్గాలు సమావేశం అవటంలో తప్పేలేదంటున్నాయి.  మొత్తానికి తాజా వివాదం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.