రోజాకు గ‌డ్డు రోజులు!

న‌గ‌రి ఎమ్మెల్యే రోజా పేరు విన‌గానే ఫైర్‌బ్రాండ్ నాయ‌కురాలు అని అంతా అంటారు. న‌గ‌రిలో వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన ఆమె.. ఏపీ రాజ‌కీయాల్లో త‌న‌దైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. సీఎం జ‌గ‌న్‌ను ఎవ‌రైనా ఏమ‌న్నా అంటే ఆమె త‌న మాట‌ల‌తో దాడి చేయ‌డం తెలిసిందే. అలాంటి నాయ‌కురాలిగా ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌ల నుంచే అస‌మ్మ‌తి ఎదుర్కొంటున్నారు. న‌గ‌రి వైసీపీలో కేజే కుమార్ సార‌థ్యంలో ఓ వ‌ర్గం నాయ‌కులు రోజాకు వ్య‌తిరేకంగా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రోజురోజుకూ రోజాకు ఆ అస‌మ్మ‌తి సెగ పెరుగుతోంది.

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీలోని ఆరుగురు రోజాను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ కాకుండా చేయాల‌నేది వాళ్ల ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఇప్ప‌టి నుంచే గ్రూపు రాజ‌కీయాలు న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం. పార్టీ కోసం రోజా ఎంతో క‌ష్ట‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించ‌డమంటే చిన్న విష‌య‌మేమీ కాదు. కానీ టీడీపీలో నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఆమె ఎంట్రీతో న‌గ‌రిలో స్థానిక వైసీపీ నేత‌ల హ‌వా పూర్తిగా త‌గ్గిపోయింది. ఇది త‌ట్టుకోలేని మ‌రో వ‌ర్గం నాయ‌కులు రోజాను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లు తెలిసింది. ప‌రిష‌త్‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రోజాకు వ్య‌తిరేకంగా మ‌రో వ‌ర్గం ప‌నిచేసింది.

తాజాగా సీఎం జ‌గ‌న్ పుట్టిన‌రోజు వేడుక‌ల పేరుతో మ‌రో వివాదం మొద‌లైంది. ఈ నెల 21న జ‌గ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా త‌మ ఆధ్వ‌ర్యంలోనే వేడుకలు జ‌ర‌పాల‌ని రోజాకు వ్య‌తిరేకంగా ఉన్న ఆరుగురు నాయ‌కులు స‌మావేశం పెట్టుకుని నిర్ణ‌యించుకున్నారు. రోజాను బాయ్‌కాట్ చేస్తామంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ ఇదే ఐక్య‌త కొన‌సాగించి త‌మ‌లోనే ఒక‌రికి ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రోవైపు ఈ అస‌మ్మ‌తిని త‌గ్గించ‌డానికి రోజా ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోరుతున్నారు. త‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుభూతి వ‌చ్చేలా చూసుకుంటున్నారు. ఇటీవ‌ల వ‌రుస కార్యక్ర‌మాల‌తో ఆమె ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటున్నారు. మీతో మీ ఎమ్మెల్యే అనే కార్య‌క్ర‌మాన్ని మొద‌లు పెట్టి ప్ర‌తి రోజు ఒక్కో ఊరికి వెళ్తూ వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని అక్క‌డికక్క‌డే ప‌రిష్క‌రిస్తున్నారు. త‌ను చేసే ప్ర‌తి ప‌నిని సోష‌ల్ మీడియా, మెయిన్ మీడియా ద్వారా హైలెట్ అయ్యేలా చూసుకుంటున్నారు.

ఇలా ప్ర‌స్తుతం గ‌డ్డు రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌జ‌ల బ‌లం పెంచుకుని తిరుగులేని విజ‌యాన్ని సాధించాల‌ని రోజా ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. ప్ర‌జ‌లే త‌న త‌ర‌పున నిలబ‌డేలా చూసుకుంటున్నారు. మ‌రోవైపు రోజా వ్య‌తిరేక వ‌ర్గం కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయం వేడి మీద ఉంది. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.