అమ్మ ‘వేద నిలయం’.. ఇక నుంచి వారిది!


తమిళనాడు ‘అమ్మ’గా అందరి మనసుల్ని ఆక్రమించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివసించిన వేద నిలయం హక్కుదారులు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చింది. పోయెస్ గార్డెన్ లోని ఈ సువిశాల ఇంటి హక్కుదారులు ఎవరన్న విషయంపై తాజాగా మద్రాసు హైకోర్టు క్లియర్ చేసింది. జయలలితకు ఎంతో ఇష్టమైన ఈ ఇంటికి చట్టబద్ధమైన హక్కుదారుల్ని గుర్తించటమే కాదు.. తాజాగా ఆ ఆస్తికి సంబంధించిన తాళాల్ని జయలలిత మేనకోడలు దీపకు అప్పజెప్పారు.

అనారోగ్యంతో సుదీర్ఘ కాలం ఆసుపత్రిలో ఉన్న జయలలిత.. చివరకు మరణించిన సంగతి తెలిసిందే. ఎంతకూ తగ్గని జర్వం అన్న పేరుతో అర్థరాత్రి పూట హడావుడిగా వేద నిలయం నుంచి తరలించిన ఆమె.. చివరకు విగతజీవిగానే ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత అమ్మ ఇంటిని ఏం చేయాలన్న దానిపై చర్చ జరిగింది. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం.. ఈ ఇంటిని జయ స్మారకంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత మేనకోడలు దీప.. ఆమె సోదరుడు దీపక్ ఇద్దరు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు.. వేద నిలయాన్ని స్మారకంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు చెల్లవని.. దాన్నిరద్దు చేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆ ఇంటిని.. వారసులైన వారిలో దీప.. దీపక్ లకు అప్పజెప్పాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మరోసారి చర్చించిన తాజా స్టాలిన్ ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వేద నిలయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా తాజాగా వేద నిలయం ఇంటి తాళం చెవుల బాక్సును.. అమ్మ మేనకోడలు దీపకు చెన్నై కలెక్టర్ విజయరాణి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దీప.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇది మామూలు విజయం కాదన్న ఆమె.. జయలలిత మరణం తర్వాత ఇంత కాలానికి ఈ ఇంట్లో మళ్లీ అడుగు పెట్టటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. “ఈ ఇంట్లోనే జన్మించాను. అత్త జయలలితతో ఈ ఇంట్లోనే గడిపిన గురుతులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటితో నా మనసు నిండిపోయి ఉంది” అని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటి తాళాలు ఇచ్చిన నేపథ్యంలో.. దీప.. ఆమె భర్తతో పాటు బంధువులుకొద్ది మంది కలిసి ఇంట్లోకి వెళ్లారు. జయలలిత చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఇది జయలలిత సొంతిల్లు అని.. దీనిపై ఎలాంటి రాజకీయం అక్కర్లేదని స్పష్టం చేశారు. దీంతో అమ్మ ఎంతగానో ఇష్టపడే ఇల్లు ఎవరికి దక్కుతుందన్న వివాదం కొలిక్కి వచ్చి.. సుఖాంతమైనట్లే.