నాపై వేటేస్తే టీడీపీకే నష్టం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ పై క్షమాపణ చెప్పడం చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వంశీ అనేక షాకింగ్ కామెంట్లు చేశారు.

తాను ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే అని, వైసీపీలో చేరే అవకాశమే లేదని వంశీ వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలు పరిష్కారానికే వైసీపీకి మద్దతిచ్చానని చెప్పారు. అంతేగానీ, వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు లేవన్నారు. టీడీపీకి ఉన్న 23మంది ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీకి దూరమయ్యారని, కాబట్టి తనలాంటి వారిని దూరం చేసుకుంటే చంద్రబాబుకే నష్టమని అన్నారు.

టెక్నికల్ గా తాను టీడీపీలోనే ఉన్నానని, తనపై చర్యలు తీసుకుంటే టీడీపీ బలం తగ్గి, ప్రధాన ప్రతిపక్ష హోదా పోతుందన్నారు. తనను ఎవరూ ప్రలోభాలకు గురి చేయలేదని, అసలు జగన్ తనను వైసీపీలోకి రమ్మని ఎప్పుడూ ఆహ్వానించలేదని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా తీయడానికి ముందు రామ్ గోపాల్ వర్మ తనతోపాటు పలువురు రాజకీయ నాయకులను కలిశారని వంశీ అన్నారు. ఈ సందర్భంగా తనకు తెలిసిన కొంత సమాచారాన్ని వర్మతో పంచుకున్నానని చెప్పారు.

అయితే, ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో పరిటాల రవి- పవన్ లపై వర్మ పెట్టిన పోస్ట్ తన దృష్టికి వచ్చిందని, ఆ విషయంలో తనకు, వర్మకు మధ్య వాదన జరిగిందని అన్నారు. పరిటాల రవి, పవన్ కల్యాణ్ అసలు కలుసుకోలేదని, అటువంటిది పవన్ కు పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తల్లో నిజం లేదని తాను వాదించినట్లు వంశీ చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమాలో ఆ సీన్ పెట్టలేదని గుర్తు చేసుకున్నారు.