‘ఓబుళాపురం’ కేసులో కేవీపీ.. కోర్టుకు రాక తప్పదా?

KVP

పెను సంచలనంగా మారి.. వైఎస్ హయాంలోని మైనింగ్ శాఖ మంత్రి మొదలు ఆ శాఖకు చెందిన కీలక అధికారి శ్రీలక్ష్మీతో పాటు ఎంతోమందికి తిప్పలు తెచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి సాక్షి ఒకరు ఇచ్చిన వాంగ్మూలంలో అప్పటి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు పేరును ప్రస్తావించారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. ఆయన వాంగ్మూలాన్ని ఎందుకు తీసుకోలేదంటూ సీబీఐను.. హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో.. ఈ కేసులో కేవీపీ వంతు వచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఈ కేసులోనే సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ జైలుకు వెళ్లాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఓఎంసీ కేసులో గనుల చట్టానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేసి.. పరిహారం ఇప్పించాలంటూ ఏపీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ 2015లో పిటిషన్ దాఖలు చేశారు.

దీనికి సంబంధించిన తాజా విచారణను బుధవారం హైకోర్టులో జరిగింది. దీనికి సంబంధించి సీబీఐ తరఫున న్యాయవాది కె. సురేందర్ వాదనలు వినిపిస్తే.. శ్రీలక్ష్మీ తరఫున న్యాయవాది రాఘవాచార్యులు వాదనలు వినిపించారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలోని ముఖ్యాంశాలు శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఓఎంసీకి లీజులు కేటాయించారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓఎంసీ కర్ణాటకలో అక్రమంగా మైనింగ్ చేసి.. ఖనిజాన్ని తరలించటానికి వీలుగా ఏపీలో లీజులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాక ముందే లీజులు కేటాయించారు. ఇతరులు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే విషయాన్నిశశికుమార్ అనే వ్యక్తి కూడా వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో తన దరఖాస్తును పరిశీలించాలని అధికారిణి శ్రీలక్ష్మిని సంప్రదిస్తే.. ఇది చాలా లాభదాయమైన వ్యాపారమని.. కోట్లల్లో చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

అంతేకాదు.. ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావును కలిసి అధికారులకు ఎంతెంత చెల్లించాలో బేరమాడాలని కూడా సలహా ఇచ్చారు. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ ను కలిస్తే సానుకూలంగా స్పందిస్తారని చెప్పారు. మరోసారి కలిసినప్పుడు రూ.8లక్షలు డిమాండ్ చేశారు. ఇతర నిందితులతో కలిసి వారికి లబ్ధి చేకూరేలా కుట్ర పన్నారు. సరిహద్దు వివాదం తేలే వరకు విచారణను నిలిపవేయాలి. కేసు కొట్టి వేయాలంటూ వేసిన పిటిషన్లను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. సీబీఐకి పరిధి లేదని పిటిషనర్ చెప్పటం సరికాదు. విచారణలో సీబీఐ కేసును రుజువుచేస్తుంది. ఈ దశలో శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేయాలి.
శ్రీలక్ష్మి తరఫున న్యాయవాది వాదనల్లోని ముఖ్యాంశాలు
మైనింగ్ చట్ట నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఉన్నతాధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు.

అంతే తప్పించి దర్యాప్తు చేసే పరిధి సీబీఐకు లేదు. నిందితులతో కలిసి శ్రీలక్ష్మి కుట్ర పన్నారని చెప్పటానికి ఒక్క ఆధారం కూడా లేదు. కర్ణాటక నుంచి ఖనిజం తరలిస్తున్నారని చెబుతున్నప్పుడు.. ఏపీలోఅక్రమ మైనింగ్ జరగలేదు. నిబంధనల ప్రకారమే లీజు మంజూరు చేశారు. దీనిపై కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. ఇలా ఇరువురు న్యాయవాదులు తమవాదనలు వినిపించే క్రమంలో.. ఒక సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలో నాటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు పేరు ప్రస్తావన రావటంతో.. కోర్టు స్పందిస్తూ.. ఆయన నుంచి వాంగ్మూలం తీసుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేవీపీ నుంచి వాంగ్మూలం తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇదేకేసు మీద మరింత లోతుగా విచారణ సాగి.. కేవీపీ ప్రస్తావన వచ్చిన పక్షంలో ఆయన వాంగ్మూలం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటివరకు ఓబుళాపురం మైనింగ్ కేసులోకి రాని కేవీపీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పాలి.