జగన్ భలే మ్యానేజ్ చేశారుగా ?


జనాల నాడిని జగన్మోహన్ రెడ్డి బాగానే స్టడీ చేసినట్లున్నారు. తాజాగా మూడు జిల్లాల పర్యటనలో బయటపడింది. భారీ వర్షాలు, వరదల కారణంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. వందల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అలాగే మూడు జిల్లాల్లో కలిపి సుమారుగా 60 మంది చనిపోయారు. వేల ఎకరాల్లో పంటలతో పాటు ఇతర వ్యక్తిగత ఆస్తులను కూడా జనాలు నష్టపోయారు. వర్షాలు, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు పర్యటించారు.

తన పర్యటనల్లో జగన్ పై జనాలను రెచ్చగొట్టేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఎందుకంటే వర్షాలు కురుస్తున్నపుడు, వరద ప్రభావం ఉన్న సమయంలో బాధితులను జగన్ వ్యక్తిగతంగా పరామర్శించలేదు. దీన్ని అవకాశంగా తీసుకుందామని చంద్రబాబు తెగ ప్రయత్నించారు. ప్రభావిత ప్రాంతాల్లో జగన్ హెలికాప్టర్లో మాత్రమే తిరిగి చూశారు. జగన్ హెలికాప్టర్ సర్వేపైన కూడా చంద్రబాబు, లోకేష్ బాగా విమర్శలు చేశారు. 

తప్పదనో, ప్రతిపక్షాల విమర్శలు తట్టుకోలేకనో  తాజాగా జగన్ మూడు జిల్లాల్లో పర్యటించారు. జగన్ పర్యటనల్లో బాధితుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చాలామంది అంచనా వేశారు. అయితే ఎక్కడ కూడా ఒక్క చిన్న ఘటన కూడా జరగలేదు. బాధితులను జగన్ పరామర్శించిన విధానం వాళ్ళలో భరోసా నింపిన విధానంతో బాధితులందరూ హ్యాపీ అయిపోయారు. తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆప్యాయంగా పలకరించారు. ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్లలో ప్రభుత్వమే ఇళ్ళు కట్టిస్తుందని చేసిన ప్రకటనతో పరిస్థితి సానుకూలమైపోయింది.

ఇప్పటికే పంట నష్టాలు, ఆస్తుల నష్టాలను కేంద్ర బృందాలు స్వయంగా పరిశీలించి అంచనాలు వేశాయి. బాధితులను ఆదుకునేందుకు జగన్ యంత్రాంగాన్ని మొదట్లోనే అప్రమత్తం చేశారు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప ప్రభుత్వంపై ఎక్కడా అసంతృప్తి కనబడలేదు. దానికి తోడు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఆర్సీని పదిరోజుల్లో ప్రకటిస్తామని జగన్ తిరుపతిలో  చేసిన ప్రకటన వ్యూహాత్మకమనే చెప్పాలి. వరద సహాయక పనులను దగ్గరుండి చూసుకుంటున్న ఉద్యోగులు జగన్ ప్రకటనతో హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తం మీద తన పర్యటనను జగన్ భలే మ్యానేజ్ చేశారనే అందరూ అనుకుంటున్నారు.