ఉద్యోగ సంఘాల దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

ఉద్యోగ సంఘాల దెబ్బకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీ నుండి సమ్మె చేయబోతున్నట్లు చీఫ్ సెక్రటరీకి ఉద్యోగ సంఘాల నేతలు నోటీసిచ్చారు. పీఆర్సీ అమలు, పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని, పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ఎప్పటినుండో కోరుతున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు ఏదో సాకు చెబుతూ కాలయాపన చేస్తోంది.

ఆర్థిక అంశాలను వాయిదా వేస్తోందంటే అర్థముంది. కానీ పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వడం, సీపీఎస్ రద్దు లాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. ప్రభుత్వంతో చర్చలు జరిపి జరిపి నేతలు విసిగిపోయి చివరకు సమ్మె నోటీసిచ్చారు. దాంతో హడావుడిగా ఈరోజు అంటే శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ డిసైడ్ అయ్యింది.

ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటిలో అన్ని విషయాలను శుక్రవారం మధ్యాహ్నం చర్చించి నిర్ణయం తీసుకుందామని కార్యదర్శుల కమిటిలో కీలక సభ్యుడైన శశిభూషణ్ కుమార్ నుంచి నేతలకు సమాచారం అందింది. దాంతో ఉదయం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరపాలని నేతలు ఏర్పాటు చేసుకున్నారు.

అంటే జరుగుతున్నది చూస్తుంటే ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్లు అన్నీ కాకపోయినా కనీసం ముఖ్యమైన పీఆర్సీ నివేదిక అమలు, డీఏల విడుదల, సీపీఎస్ రద్దు లాంటివైనా పరిష్కారమయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఉద్యోగులతో గొడవ పెట్టుకోవటం ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అలా కాదని ఉద్యోగులను దూరం చేసుకుంటే ఏమవుతుందో చరిత్రను గమనిస్తే అర్ధమైపోతుంది. బహుశా ఈ విషయాన్ని గ్రహించింది కాబట్టే చివరి నిముషంలో సమావేశం ఏర్పాటు చేసింది ప్రభుత్వం.