ఏపీలో గంజాయిపై రాజ్యసభలో షాకింగ్ గణాంకాలు

కొద్ది రోజులుగా ఏపీలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడుతోన్న వైనం కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు యథేచ్ఛగా సాగుతోందని, అయినా పోలీసులు, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా…వాటి మూలాలు ఏపీలో ఉంటున్నాయని, ఏపీ బ్రాండ్ నేమ్ చెడిపోతోందని విమర్శిస్తున్నారు.

గతంలో ఈ స్థాయిలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడిన దాఖలాలు లేవని అంటున్నారు. మరోవైైపు, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఏపీలో గంజాయి వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో చేసిన ప్రకటన షాకింగ్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో దొరికిన గంజాయి పరిమాణం చాలా ఎక్కువని, గత మూడేళ్లలో ఈ పరిమాణం 3 రెట్లు పెరిగిందని సభలో ఆయన వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. 2018లో 33,930.5 కిలోల గంజాయి ఆధారిత మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, 2019లో అది రెండింతలై 66,665.5 కిలోలకు పెరిగిందని చెప్పారు. గత ఏడాది ఆ పరిమాణం ఏకంగా 3 రెట్లు పెరిగి 1,06,042.7 కిలోలకు చేరుకుందని వెల్లడించారు.

ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఈ ఏడాది రికార్డు స్థాయిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు మాదకద్రవ్యాల నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని సభకు రాయ్ వెల్లడించారు.