జగన్ తప్పు చేస్తున్నారా ?

జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నట్లే ఉంది. ఉద్యోగులతో అనవసరంగా గోక్కుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించిందంటే అందులో ఉద్యోగుల పాత్ర కూడా ఉంది. అలాంటి ఉద్యోగులతో జగన్ ప్రభుత్వం కోరి ఎందుకని గోక్కుంటున్నదో అర్థం కావటంలేదు. బుధవారం ఉద్యోగ సంఘాల నేతలు చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి సమ్మె చేయబోతున్నట్లు నోటీసిచ్చారు. లాంగ్ పెండింగ్ డిమాండ్ల సాధనకై తాము సమ్మె చేయాలని డిసైడ్ అయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 

పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయడం, అమలు చేయడం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయడం లాంటి డిమాండ్లున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు మొదటి నుండి జగన్మోహన్ రెడ్డితో నేరుగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదు. ఎంతసేపు నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీతోనే భేటీ అవుతున్నారు. కారణాలు తెలీదు కానీ సీఎం మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో భేటీకి ఇష్టపడటంలేదు. 

పీఆర్సీ అమలు సంగతిని పక్కన పెట్టేసినా అసలు పీఆర్సీ నివేదికనే ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయటం లేదో అర్థం కావటంలేదు. ఏ ప్రభుత్వమైనా పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు ఇవ్వటం మామూలే. ఆ నివేదికను స్టడీ చేసిన తర్వాత నేతలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. నేతలు-చీఫ్ సెక్రటరీ లేదా నేతలు-మంత్రుల బృందంతో ఫిట్మెంట్ ఫైనల్ అయిన తర్వాతే సీఎంతో భేటీ అవుతారు. ఎంత ఫిట్మెంట్ ఇచ్చేది సీఎం ప్రకటిస్తారు. 

ఇదంతా ఎవరు అధికారంలో ఉన్నా రివాజుగా జరిగే తంతే. చంద్రబాబునాయుడు హయాంలోనే. ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగడంతో  ఇపుడు అందులో పాతిక శాతం కూడా ఫిట్మెంట్ ఇవ్వలేని స్థితిలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఉంది.  ఉద్యోగులకు ఎవరు సీఎంగా ఉన్నారన్నది అనవసరం. పీఆర్సీ అమలైందా ? డీఏలు అమలవుతున్నాయా లేదా ? అన్నదే పాయింట్ ఇక్కడ. 

పీఆర్సీ అమలు విషయాన్ని పక్కనపెట్టినా ముందు ఆ నివేదికను ఉద్యోగ సంఘాల నేతలకు అందచేయకుండా ప్రభుత్వం తప్పుచేస్తోంది. ఎప్పుడైతే నివేదికను ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందో అందరికీ నివేదికపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వేలాది కోట్ల రూపాయలను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చుపెడుతున్న జగన్ ఉద్యోగుల విషయంలో ఎందుకింత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం కావటంలేదు. కోరి ఉద్యోగులతో గొడవలు పెట్టుకోవటం ప్రభుత్వానికి ఏమాత్రం క్షేమం కాదు. మరి ఈ విషయాన్ని జగన్ ఎందుకు గుర్తించటం లేదో.