సీఎం జ‌గ‌న్‌తో మోహ‌న్‌బాబు.. భేటీ! రీజ‌నేంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు భేటీ కానున్నారు. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌కు చేరుకున్న మోహ‌న్ బాబు జగన్ తో భేటీకి అప్పాయింట్‌మెంట్ ఖ‌రారైంది.  గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న‌ మోహన్‌బాబుకు అభిమానులు స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు సెంటిమెంటు డైలాగ్ ఒక‌టి విసిరారు. ‘‘నా విజయవాడకు రావడం నాకు చాలా సంతోషం’’ అని అన్నారు. ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఆ పై ఎయిర్‌పోర్టు నుంచి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి  వెళ్లారు.

ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు, మోహ‌న్‌బాబు కు ఆత్మీయ మిత్రుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందటంతో ఆ కుటుంబాన్ని మోహన్‌బాబు పరామర్శించనున్నారు. అనంతరం ఏపీ సీఎం జగన్‌ను కలిసేందుకు వెళ్తున్నారు. అయితే.. జ‌గ‌న్‌తో భేటీ వెనుక రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి ఇటీవ‌ల జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌.. `మా` ఎన్నిక‌ల్లో మంచు ప్యానెల్ విజ‌యం ద‌క్కించుకుంది. అత్యంత ట‌ఫ్‌గా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల వెనుక‌.. ముఖ్యంగా మంచు ప్యానెల్ విజ‌యం ద‌క్కించుకోవ‌డం వెనుక ఏపీ అధికార పార్టీ అండ‌దండ‌లు ఉన్నాయ‌నే వాద‌న‌లు వినిపించాయి.

ఈ నేప‌థ్యంలో మోహ‌న్‌బాబు స్వ‌యంగా క‌లిసి.. జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌నున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్ లో విక్ర‌యించేందుకు అనువుగా రాష్ట్ర ప్ర‌భుత్వం.. ఇటీవ‌లే బిల్లును ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించుకుంది. ఈ క్ర‌మంలో దీనిపైనా.. మోహ‌న్‌బాబు చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని రోజుల కింద‌ట‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించాలంటూ.. మోహ‌న్‌బాబును టార్గెట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. అప్ప‌ట్లో మా ఎన్నిక‌లు ఉన్నందున తాను త‌ర్వాత‌.. స్పందిస్తాన‌న్న మోహ‌న్‌బాబు.. త‌ర్వాత‌.. పెద‌వి విప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యం కూడా.. వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక‌, ఇటీవ‌ల చంద్ర‌బాబు క‌న్నీరు. స‌భ‌లో జ‌రిగిన సంగ‌తులు ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.