ఓడిన చోట గెల‌వాల‌ని

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌ని పెద్ద‌లు చెప్తుంటారు. అదే రాజ‌కీయాల‌కు అన్వ‌యిస్తే.. ఓడిన చోటే గెల‌వాల‌ని నాయ‌కులు చూస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా అదే సూత్రాన్ని పాటించేందుకు ముందుకు సాగుతున్నారు. అందుకే రాజ్య‌స‌భ అవ‌కాశాన్ని కూడా వ‌దిలేసుకున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో పోటీ చేసి తిరిగి విజ‌య బావుటా ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఆమె ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మ‌ళ్లీ ఎమ్మెల్సీగా..
తెలంగాణ‌లో ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ ముగింపు దిశ‌గా సాగుతోంది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే కోటా కింద ఆరు స్థానాల‌కు గాను టీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఇక స్థానిక సంస్థ‌ల కోటా కింద 12 స్థానాల‌కు గాను నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగిసింది. అందులో టీఆర్ఎస్ త‌ర‌పున ఏడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌, శంభీపూర్ రాజు, ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి, భాను ప్ర‌సాద్ రావు, కూచికుళ్ల దామోద‌ర్ రెడ్డి, క‌సిరెడ్డి నారాయ‌ణ‌రెడ్డి, పోచంప‌ల్లి శ్రీనివాస్‌రెడ్డికి మ‌రో అవ‌కాశం ద‌క్కింది. ఇక అయిదు స్థానాల్లో కొత్త‌గా ఎల్‌.ర‌మ‌ణ‌, దండె విఠ‌ల్‌, తాత మ‌ధు, యాద‌వ‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డిల‌కు కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. అయితే మ‌రో రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ రాజ్య స‌భ నుంచి బండా ప్ర‌కాశ్‌ను ర‌ప్పించిన కేసీఆర్‌.. ఆయ‌న్ని ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీని చేశారు. దీంతో ఆయ‌న స్థానంలో క‌విత రాజ్య‌స‌భ‌కు వెళ్తార‌నే ప్ర‌చారం సాగింది. కానీ స్థానిక సంస్థ‌ల కోటా కింద ఆమె మ‌ళ్లీ ఎమ్మెల్సీగా నామినేష‌న్ వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని..
ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత జ‌రిగిన 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీగా క‌విత గెలిచారు. 2018లో రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మాత్రం క‌విత‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్ చేతిలో ఆమె ఓడారు. ఆ త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా ఉన్న భూప‌తి రెడ్డి పార్టీ మారి ఆ ప‌ద‌వి పోగొట్టుకున్నారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వ‌చ్చింది. 2020 అక్టోబ‌ర్ 9న జ‌రిగిన ఆ ఉప ఎన్నిక‌లో గెలిచిన క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం మొద‌లెట్టారు.

ఎమ్మెల్సీగా గెలిచిన ఆమెను కేసీఆర్ మంత్రివ‌ర్గంలోకి తీసుకుంటారేమోన‌న్న వార్త‌లు అప్పుడు వ‌చ్చాయి. కానీ అలా చేస్తే విప‌క్షాలు విమ‌ర్శ‌ల‌కు తావిచ్చిన‌ట్లు అవుతుంద‌నే ఉద్దేశంతో కేసీఆర్ ఆగిపోయార‌ని స‌మాచారం. కానీ ఇప్పుడేమో ఆమెను రాజ్యస‌భ ఎంపీగా చేయాల‌ని కేసీఆర్ అనుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. కానీ వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆమె మొగ్గుచూపుతున్న‌ట్లు తెలిసింది. అదే నిజామాబాద్ గ‌డ్డ‌పై తిరిగి విజ‌యం సాధించి ప్ర‌త్య‌ర్థిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఆమె అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.