శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలనుకుంటున్న బీజేపీ

గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం అమ్మటంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ ఆంక్షలను ప్రభుత్వం తీసుకున్నది అని కాకుండా స్ధానిక సంస్ధలు తీసుకున్నాయనే కలరింగ్ ఇస్తోంది బీజేపీ. ఇంతకీ విషయం ఏమిటంటే గుజనాత్ లో కొద్దిరోజులుగా మాంసాహారంపై స్ధానికంగా గొడవలు మొదలయ్యాయి. మాంసాహార వంటలను, స్నాక్స్ ను అమ్మే రోడ్డుపక్క బండ్లు, షాపులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి.

ఎందుకంటే గుజరాత్ మొత్తాన్ని శాఖాహార రాష్ట్రంగా మార్చేయాలన్న అధికార పార్టీ ఆలోచనే దీనికి కారణమని సమాచారం. నిజానికి ఆహారమన్నది వ్యక్తిగత ఇష్టం. ఎవరు ఏ ఆహారం తీసుకుంటారన్నది పూర్తిగా వాళ్ళ ఇష్టమని అందరికీ తెలిసిందే. మాంసాహారం తీసుకునే వాళ్ళల్లో కొందరికీ ప్రతిరోజు మాంసాహారం లేనిదే ముద్దదిగదు. ఈ విషయం తెలిసినా గుజరాత్ లోని స్వాధ్యాయ పరివార్, స్వామి నారాయణ్ సంస్ధల ముసుగులో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి.

పై సంస్ధలకు బీజేపీ నేతలు కూడా తోడవ్వటంతో వ్యాపారులకు ఏమి చేయాలో అర్ధం కావటంలేదు. వడోదర, రాజ్ కోట్, జూనాగడ్, భావ్ నగర్ మున్సిపాలిటి ప్రాంతాల్లో మాంసాహారం అమ్మే షాపులపైన, రోడ్డు పక్కన మాంసాహార వంటకాలను అమ్మే బండ్లపైన వరుసబెట్టి దాడులు జరుగుతున్నాయి. దాంతో మాంసాహారం అమ్మే వాళ్ళు భయపడిపోయి తమ వ్యాపారాలను మూసేసుకున్నారు. వరుసదాడుల కారణంగా ఇపుడు పై ప్రాంతాల్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ లాంటి వంటకాలను అమ్మే షాపులు ఎక్కడా కనబడటంలేదు.

తాజా పరిమాణాలతో మాంసాహార ప్రియులకు ప్రభుత్వంపై మండిపోతోంది. పై మున్సిపాలిటి ప్రాంతాల్లో అనధికారికంగా మాంసాహారం అమ్మే దుకాణాలపై దాడులు జరుగుతున్నాయని, మాంసాహార విక్రయాలను నిషేధించారని జనాలు ప్రభుత్వంతో మొత్తుకున్నా పట్టించుకోవటంలేదు. మాంసాహార అమ్మకాలపై నిషేధమంతా పూర్తిగా అనధికారికంగానే జరుగుతోంది కాబట్టే ప్రభుత్వం ఏమాత్రం స్పందించటంలేదు.

పై రెండుసంస్ధలతో పాటు బీజేపీ నేతలపై మామూలు జనాలు మండిపోతున్నారు. తాము ఇదే ఆహారం తినాలని చెప్పేందుకు బీజేపీ నేతలకు అధికారం ఏముందంటు గోల చేస్తున్నారు. కాకపోతే అధికారికంగా తీసుకున్న నిర్ణయం కాకపోవటంతో పార్టీ కూడా స్పందించటంలేదు. ఇలాంటి అనేక చర్యలతో బీజేపీపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. మాంసాహార అమ్మకాలను నిలిపేసే బదులు ఏరులై పారుతున్న మద్యాన్ని నియంత్రించాలంటు జనాల్లో గోల పెరిగిపోతోంది. అయినా జనాల గోలను ఎవరూ పట్టించుకోవటంలేదు.