ఆ విష‌యంలో టీడీపీని బీజేపీ హైజాక్ చేస్తుందా..?

రాజ‌కీయాల్లో పార్టీలు ఒక‌రిపై ఒక‌టి పైచేయి సాధించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం మామూలే. ఒక‌రి క‌న్నా ఎక్కువ మంచి విధానాల‌తో మ‌రో పార్టీ ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఇది కామ‌న్‌గా జ‌రిగేదే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యం లోనూ పోటీకి రాని.. బీజేపీ.. ఇప్పుడు కొత్త‌గా ఒక విష‌యంలో పెద్ద పోటీనే ఇస్తోంది.

నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు అనేక ప్ర‌యాస‌లు ప‌డుతున్న నాయ‌కులు.. వ్యూహాలు దొర‌క్క, వేసిన వ్యూహాలు సైతం పార‌క ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో పార్టీ ప‌రిస్థితి ఒక అడుగు ముందుకు.. ప‌ది అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా మారిపోయింది. దీంతో వ్యూహ లేమితో బీజేపీ నాయ‌కులు కొట్టుమిట్టాడుతున్నారు.

అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వారికి పై నుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యం క‌లిసి వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యాన్నినాన్చిన బీజేపీ పెద్ద‌లు.. ఒక్క‌సారిగా దీనిపై యూటర్న్ తీసుకున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేత‌లు పుంజుకున్నారు. తాజాగా నాయ‌కులు అంద‌రూ.. ఒక్క ఉదుటన అమ‌రావ‌తికి జై కొట్టారు. రైతుల‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. మేముంటాం. మీకు అండ‌గా!అంటూ.. నిన‌దించారు. అంతేకాదు.. కేంద్రం కూడా మీకే అనుకూలంగా ఉంద‌ని బాంబు పేల్చారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ అమ‌రావ‌తి విష‌యంలో సానుకూలంగా ఉన్నార‌ని చెప్పారు.

ఇక‌, ఈ క్ర‌మంలో కేంద్రంలో చక్రం తిప్పుతున్న కీల‌క నాయ‌కులు.. రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తుగా పాద‌యాత్ర‌లోనూ పోటెత్తారు. ఒక‌రి వెనుక ఒక‌రు కాకుండా.. గంపగుత్త‌గా నాయ‌కులు ఇక్క‌డ వాలిపోయారు. దీంతో అటు అమ‌రావ‌తి రైతుల్లో భ‌రోసా వ‌చ్చేసింది. త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని.. కేంద్రం త‌మ‌వైపే ఉంద‌ని .. కూడా వారు న‌మ్ముతున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌ల్లో దిగులు ప్రారంభ‌మైంది. ఎందుకంటే.. వారు మొద‌టి నుంచి అమ‌రావ‌తికి అనుకూలం. ఉద్య‌మంలోనూ వారు నేరుగా అనేక సంద‌ర్భాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు పాద‌యాత్ర‌ను కూడా దిగ్విజ‌యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.

దీంతో అమ‌రావతి ఉద్య‌మం స‌క్సెస్ అయితే.. ఆ క్రెడిట్ అంతా కూడా త‌మ‌కే ద‌క్కుతుంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కులు భావించారు. అయితే.. ఇప్పుడు.. దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఎంట్రీ ఇచ్చిన బీజేపీ. అంతా త‌మ చేతిలోనే ఉంద‌ని అన్న‌ట్టుగా పెద్ద నేత‌లు.. వాలిపోయారు. పాద‌యాత్ర ముగిసేవ‌ర‌కు రైతుల‌తోనే ఉంటామ‌న్నారు. అంతేకాదు.. అమ‌రావ‌తే రాజ‌ధాని అని నొక్కి చెప్పారు. దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌ల్లో అంత‌ర్మ‌థ‌నం ప్రారంభ‌మైంది.

ఇన్నాళ్లు ఎంతో ఒద్దిక‌గా.. సెంటిమెంటుగా మార్చుకున్న అమ‌రావ‌తి క్రెడిట్‌ను బీజేపీ హైజాక్ చేస్తోందా ? అని వారు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం కీల‌క సెంటిమెంటుగా టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో దోహ‌ద‌ప‌డనున్న ఈ అమ‌రావ‌తి విష‌యంలో బీజేపీ-వైసీపీ క‌లిసి కుట్ర ఏమైనా చేస్తున్నాయా? ఈ క్రెడిట్ త‌మ‌కు (టీడీపీ) ద‌క్క‌కుండా అడుగులు వేస్తున్నాయా ? అనే చర్చ త‌మ్ముళ్ల మ‌ధ్య జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.