ద‌ర్శి పాపం ఎవ‌రిది? వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం

గెల‌వాల్సిన చోట ఓడిపోవ‌డం.. అంటే.. ఇదే! మ‌రి ఈ పాపం ఎవ‌రిది? ఎందుకు వ‌చ్చింది? ఇదీ.. ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ సైతం సీరియ‌స్ అయిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో జోరుగానే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రి దీనికి బాధ్యులు ఎవ‌రు? ప్ర‌కాశం జిల్లాలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. అన్నింటిని.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ ద‌క్కిం చుకుంది. దీనిలో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం కూడా ఒక‌టి. పైగా ఇక్క‌డ టీడీపీ చాయ‌లు కూడా క‌నిపించే ప‌రిస్థితి లేకుండా.. పార్టీ అధి ష్టానం చ‌క్రం తిప్పింది. టీడీపీ త‌ర‌ఫున ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావును పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులను న‌డిపించే పెద్ద త‌ల‌కాయంటూ.. ఇక్క‌డ లేకుండా చేశారు.

దీంతో ద‌ర్శి మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం త‌థ్యమ‌ని అనుకున్నారు. ఆది నుంచికూడా అనేక లెక్క‌లు వేసుకున్నారు. మొత్తం 12 మునిసిపాలిటీల‌కు జ‌రిగిన తాజా ఎన్నిక‌ల్లో కుప్పం ఒక్క‌టే క‌ష్ట‌మ‌ని అనుకున్నారు.కానీ, కుప్పంలో సునాయాశంగా విజ‌యం సాధించ‌గా.. ద‌ర్శిలో మాత్రం వైసీపీ పెద్ద‌గా పోటీ కూడా ఇవ్వ‌లేక పోయింది. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఏమీలేద‌ని అనుకున్న చోట టీడీపీ జోరు కొన‌సాగి.. విజ‌యం దిశ‌గా దూసుకుపోయి.. వైసీపీకి షాకివ్వ‌డానికి దారితీసిన ప‌రిణామాలు ఏంటి? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. నిజానికి ఇక్కడ ఎమ్మెల్యే మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌పై పార్టీ అధిష్టానం ఆశ‌లు పెట్టుకుంది.

అయితే.. మాజీ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి.. అన్నీ తానై వ్య‌వ‌హ‌రించార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మ‌ద్దిశెట్టివ‌ర్గాన్ని ఓడించాల‌నే వ్యూహాన్ని బూచేప‌ల్లి అమ‌లు చేశార‌ని.. ద‌ర్శిలో వినిపిస్తోంది. అయితే.. బూచేప‌ల్లి వ్యూహాల‌ను ప‌సిగ‌ట్టి.. వాటిని దీటుగా ఎదుర్కొనే ప్ర‌తివ్యూహాలు వేయ‌డంలోనూ.. మ‌ద్దిశెట్టి విఫ‌ల‌మ‌య్యా రు. ఇదిలావుంటే.. ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న శిగ‌ప‌ట్లు.. ప్ర‌జ‌ల‌కు కూడా రోత పుట్టించాయ‌ని అనే వారు ఉన్నారు. ఆది నుంచి కూడా వివాదాలు.. విభేదాలు.. ర‌గ‌డ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఈ నాయ‌కులు.. ప్ర‌జ‌ల సంక్షేమంపై ఏనాడూ దృష్టి పెట్ట‌లేద‌నే వాద‌న కూడా ఉంది.

ఈ క్ర‌మంలోనే టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంద‌ని అంటున్నారు. అయితే.. ద‌ర్శి ప‌రాజ‌యాన్ని.. వైసీపీ అధినేత జ‌గ‌న్ సీరియ‌స్‌గానే తీసుకున్నారు. ఇక్క‌డ అస‌లు ఏం జ‌రుగుతోందని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ను ఆయ‌న ఆరా తీసిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఎంతో తేలిక‌గా విజ‌యం సాధించే స్థానాన్ని ఎందుకు కోల్పోయామ‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. దీనికి సంబంధించి మంత్రులు బాలినేని, ఆది మూల‌పు సురేష్‌ల‌ను కూడా బాధ్యుల‌ను చేసే అవకాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఎవ‌రికి ఇక్క‌డ‌.. షాకిస్తారో చూడాలి.