అమ‌రావ‌తిని ఇలా చేస్తారా? జ‌గ‌న్ స‌ర్కారుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌లు..

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రాష్ట్రంలో జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌..అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని.. ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయ‌ని.. పెట్టుబ‌డులు కూడా రావ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తో్ంది. అయితే.. దీనిని కొంద‌రు రాజ‌కీయ దృష్టితోనే చూశారు. అయితే.. ఇప్పుడు.. రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే వ్యాఖ్య‌లు చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తిపై దాఖ‌లైన కేసుల రోజువారీ విచారణ ప్రారంభమైంది. ఉన్నత న్యాయస్థానం సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణను మొదలుపెట్టింది. పాలన‌ వికేంద్రీకరణ(మూడు రాజ‌ధానులు), సీఆర్‌డీఏ రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. అయితే.. త్రిసభ్య ధర్మాసనం నుంచి ఇద్దరు జడ్జిలను తప్పించాలని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషన్లు దాఖలు చేసిన రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌దివాన్‌ వాదనలు వినిపించారు.

ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న ధ‌ర్మాస‌నం రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కక్షిదారులతోపాటు అందరూ ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఇక‌, రైతుల త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన దివాన్‌.. ఏమ‌న్నారంటే.. మూడు రాజధానుల ప్రతిపాదన శరీరం నుంచి ఆత్మను వేరు చేయడమేనని ఆయన చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పటికి రాష్ట్రం అలానే ఉందని, ఇచ్చిన హామీలు నెరవేరబడాలని శ్యామ్ దివాన్ తెలిపారు.

రాష్ట్ర రాజధాని కోసం, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష కోసం అమరావతి రైతులు భూములు త్యాగం చేశారు. రాజధాని భూసమీకరణలో ల్యాండ్ పూలింగ్ స్కీం కోసం ప్రభుత్వ అధికారులే రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం రూ. 5 వెలకోట్ల ఖర్చు పెట్టి నిర్మించిన‌ రాజధానిని వదిలేసింది. 41 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రభుత్వం నిలుపుదల చేసింది. రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండాలని అత్యధికంగా ప్రజలు అభిప్రాయపడ్డారు. అని కోర్టుకు దివాన్ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగానే హైకోర్టు.. అభివృద్ధి నిలిచిపోయింద‌ని వ్యాఖ్య‌లు చేసింది. అయితే.. రోజు విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో తుది తీర్పు ఎలా ఉంటుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది.