జగన్ అండ్ కో.. దీనికేం సమాధానం చెబుతారు?


అది 2019 మార్చి 15వ తేదీ.. ఇంకో నెల రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అలాంటి టైంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి.. మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందినట్లుగా వార్తలొచ్చాయి. ఆ వార్తను ముందుగా రిపోర్ట్ చేసింది సాక్షి మీడియానే. కానీ కాసేపటి తర్వాత వివేకా చనిపోయింది గుండెపోటుతో కాదు.. ఆయన్ని ఎవరో దారుణంగా హత్య చేశారన్న సమాచారం బయటికి వచ్చింది. ఒంటిపై తీవ్ర గాయాలతో వివేకా విగత జీవిగా మారిన ఫొటోలు సైతం మీడియాలో వైరల్ అయ్యాయి.

జగన్ సహా వైకాపా నేతలంతా వివేకాను హత్య చేయించింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే అంటూ నిందమోపారు. మరుసటి రోజు సాక్షి పత్రికలో ఒక ఫుల్ పేజీ స్టోరీ వేశారు. దానికి హెడ్డింగ్.. నారాసుర రక్తచరిత్ర. సాక్షాత్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లుగా గ్రాఫిక్ చేయించి.. ఆయనే ఈ హత్య చేయించినట్లు, ఇంకా మరెన్నో హత్యలు కూడా చేసినట్లుగా కథనం తీర్చిదిద్దారు. వివేకా హత్య నింద చంద్రబాబు మీద మోపి ఆయనపై జనాలకు అనుమానాలు కలిగేలా.. అదే సమయంలో జగన్‌కు సానుభూతి వచ్చేలా చేయడంలో సాక్షి మీడియా విజయవంతం అయింది.

కట్ చేస్తే రెండు నెలలు తిరిగేసరికి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో ఈ కేసు ఏమాత్రం ముందుకు కదల్లేదు. ఏపీ పోలీసులు హత్యకు సూత్రధారులెవరో తేల్చలేకపోయారు. నిజంగా చంద్రబాబో లేదా టీడీపీ నేతలో ఈ హత్య చేయించి ఉంటే జగన్ సర్కారు దాన్ని నిరూపించడం కష్టమేమీ కాదు. ఏపీ పోలీసుల నిర్వాకంతో కోర్టు జోక్యం చేసుకుని కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ చేసిన దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ హత్య వెనుకు ఉన్నదెవరో బయటికి వచ్చింది.

ఈ హత్యలో జగన్‌ దగ్గరి బంధువు, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా.. వివేకాతో సన్నిహితంగా ఉన్న వాళ్లే.. దాదాపుగా అందరూ వైకాపా వాళ్లే ఈ హత్యలో పాల్గొన్నట్లుగా దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మరి ఆనాడు చంద్రబాబు అండ్ కో మీద నిందలేసి ఆ స్థాయిలో సాక్షి మీడియా, వైకాపా వాళ్లు చేసిన హడావుడికి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్న.