బీజేపీ సీక్రెట్ మీటింగ్‌.. టార్గెట్‌ కేసీఆర్‌?

తెలంగాణ బీజేపీలో దూకుడు కొన‌సాగుతోంది. ఇటీవ‌ల హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో భారీ విజ‌యం న‌మోదు చేసిన త‌ర్వాత‌.. అదే దూకుడు కొనసాగించాల‌ని.. పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర నాయ‌కులకు వ‌ర్త‌మానం వ‌చ్చింది. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో సాక్షాత్తూ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ఉద్ఘాటించారు. దూకుడు పెంచాల‌ని.. హుజూరాబాద్ ఎఫెక్ట్‌ను ఆస‌రా చేసుకుని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. అధికారం అందుకునేలా అడుగులు వేయాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. దీంతో తెలంగాణ బీజేపీలో ఉత్సాహం మ‌రింత పెరిగింది.

ఈ క్ర‌మంలోనే తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులు. శ‌నివారం సాయంత్రం.. హైద‌రాబాద్ శివారులో అత్యంత గోప్యంగా భేటీ అయ్యారు. డిన్నర్ పార్టీ చేసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఈ స‌మావేశం లో ఏం చ‌ర్చించార‌న్న విష‌యం ఆస‌క్తిగా మారింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బాద్‌షా, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ హాజర‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఈ స‌మావేశంపై.. స‌ర్వ‌త్రా ఆసక్తి నెలొంది.

ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా అధికార పార్టీని టార్గెట్ చేయ‌డంపైనా.. అధికారంలోకి వ‌చ్చేందుకు ఉన్న మార్గాల‌ను మ‌రింత పుంజుకునేలా చేయ‌డంపైనా.. నాయ‌కులు దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం సీఎం కేసీఆర్‌.. బీజేపీని భారీ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రం ఇలా ఉండ‌డానికి బీజేపీనే కార‌ణ‌మ‌ని.. ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. అదేస‌మ‌యంలో కేంద్రంలోని బీజేపీపై ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉద్య‌మాలు చేయిస్తున్నారు. ఈ ప‌రిణాల‌ను స‌హ‌జంగానే రాష్ట్ర స్థాయిలోనే అడ్డుకోవాల‌ని.. బీజేపీ నేత‌లు భావిస్తున్నారు.

దీంతో తెలంగాణ బీజేపీని మ‌రింత ముమ్మ‌రంగా.. కేసీఆర్‌పై విజృంభిచేలా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ స‌మావేశం అంతాకూడా కేసీఆర్ చుట్టూతానే తిర‌గ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, అదేస‌మ‌యంలో పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి, రాజాసింగ్, బండి సంజయ్, రఘునందన్, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి నేతల మధ్య విభేదాలు ఉండగా.. నేతలందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి అధిష్టానం ప్ర‌య‌త్నిస్తోంది.

అందరూ కలిసి పనిచేస్తేనే టీఆర్ఎస్‌ను ఎదురుకోగలమని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదే విధంగా ఆపరేషన్ ఆకర్ష్‌ -2 గురించి కూడా చర్చించే వీలుంది. వీటితో పాటు మిలియన్ మార్చ్ విజయవంతం చేయడం, పాదయాత్ర రెండో విడతలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు తీసుకునే చాన్స్ కూడా ఉంది. తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి పని విభజన చేసుకోవాలని పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దేందుకు బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతమేరకు సఫలమవుతుందో చూడాలి. మ‌రీ ముఖ్యంగా కేసీఆర్‌పై ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.