“ఏపీ లైటెనింగ్‌”.. జ‌గ‌న్ చేస్తున్న పెద్ద త‌ప్పు!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జ‌గ‌న్ చేజేతులా త‌ప్పు చేస్తున్నారా? గ‌తంలో చంద్ర‌బాబు ఏ త‌ప్పు చేయ‌డం ద్వారా.. అధికార పీఠానికి దూర‌మ‌య్యారో.. అదే త‌ప్పు.. ఇప్పుడు జ‌గ‌న్ మ‌రింత ఎక్కువ చేస్తున్నారా? దీంతో ఏపీలో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఏపీ ఒక సంక్లిష్ల ప‌రిస్థితిలో ఉంది. ప్ర‌భుత్వ విధానాలు కావొచ్చు.. క‌రోనా ఎఫెక్ట్ కావొచ్చు.. కేంద్రం నుంచి స‌రైన స‌హ‌కారం లేక‌పోయి ఉండొచ్చు.. ఏదేమైనా.. ఏపీ ప్ర‌భుత్వంపై ఇప్పుడు కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మాత్రం ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఇసుక విధానం ఇప్ప‌టికీ.. సంక్లిష్టంగానే ఉంది. దీంతో నిర్మాణ రంగం ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది. ఇక‌, అమ‌రావ‌తి రాజ‌ధాని ఎఫెక్ట్ కార‌ణంగా.. రియ‌ల్ ఎస్టేట్ రంగం కుదేలై పోయింది. దీంతో ప్ర‌ధాన ఆదాయం రాష్ట్రానికి పోయింద‌నే చెప్పాలి. ఇక‌, పెట్టుబ‌డి దారులు సైతం.. రాష్ట్రానికి వ‌స్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో అభివృద్ధి కూడా ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయింది. ర‌హ‌దారుల కోత‌లు.. వ‌ర‌ద‌లు.. రైతుల క‌ష్టాలు య‌థాత‌థంగా ఉన్నాయి. మ‌రోవైపు.. కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న దూకుడు చర్య‌ల‌తో విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి కీల‌క క‌ర్మాగారాలు ప్రైవేటుకు పోతున్నాయి.

ఇన్ని జ‌రుగుతున్నా.. అంతా బాగానే ఉంద‌ని వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. గ‌తంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు.. అప్ప‌టి ఉప ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన బీజేపీ కీల‌క నాయ‌కుడు.. ప్ర‌స్తుత ఎంపీ.. లాల్ కిష‌న్ అడ్వాణీ.. కూడా ఇలానే చెప్పేవారు. భార‌త్ వెలిగిపోతోంది (ఇండియా లైటెనింగ్‌) అంటూ.. ఆయ‌న ఏ వేదిక ఎక్కినా.. ఆయ‌న ఉద్ఘాటించేవారు. కానీ.. వాస్త‌వంలోకి వ‌స్తే.. కేంద్రం అనుస‌రించిన‌.. అనేక‌ విధానాలు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు పెట్టాయి. ఫ‌లితంగా.. అప్ప‌టి వాజ‌పేయి ప్ర‌భుత్వం ఓట‌మి పాలైంది.

క‌ట్ చేస్తే.. వైసీపీ ప్ర‌బుత్వం కూడా “అంతా బాగుంది.. న‌వ‌ర‌త్న కాంతుల్లో ఏపీ వెలిగిపోతోంది!” అంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. తాము త‌ప్పు చేస్తున్నామ‌ని ఒప్పుకొనేందుకు సాహ‌సిం చ‌దు. కానీ.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి చేతులు దాటిపోతున్న‌ప్పుడు.. క‌నీసం ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవ‌డం .. అత్యంత అవ‌స‌రం. కానీ, ఆ త‌ర‌హా సంస్కృతి కూడా వైసీపీలో క‌నిపించ‌డం లేదు. దీంతో వైసీపీ విష‌యంలో కొన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు.. ముఖ్యంగా కార్మికులు.. తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ధ‌రాఘాతంతో ఇబ్బందులు ప‌డుతున్నారు.

తాము ప‌ట్టుకున్న కుందేటికి మూడు కాళ్లే అని చెబుతున్న ప్ర‌భుత్వ పెద్ద‌ల‌పై.. రుస‌రుస‌లాడుతున్నారు. పోనీ.. న‌వ‌ర‌త్నాలు అయినా.. అంద‌రికీ చేరుతున్నాయా? అంటే.. జ‌ల్లెడ ప‌ట్టి మ‌రీ.. ల‌బ్ధిదారుల‌ను ఏరుతున్నారు. దీంతో 25 శాతం మందికి మాత్ర‌మే ఇవి ల‌బ్ధి చేకూరుస్తుండ‌గా.. మిగిలిన ప్ర‌జానీకం.. తాము చెల్లిస్తున్న ప‌న్నుల‌తో .. పాతిక శాతం మందికి మేలు చేస్తూ.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే భావ‌న‌తో ఉన్నారు. ఇది.. మున్ముందు.. ప్ర‌జాప్ర‌భుత్వంగా.. మ‌న ప్ర‌భుత్వంగా చెప్పుకొంటున్న వైసీపీకి.. ఇక్క‌ట్లు తేవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీలకులు. మ‌రి ఇప్ప‌టికైనా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తారా? చూడాలి. ఏం జ‌రుగుతుందో!!