జగన్‌కు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి: తెలంగాణ మంత్రి

మాట‌కు మాట‌! నువ్వు రెండంటే.. నే నాలుగంటా!! నువ్వు త‌మ‌లపాకుతో అంటే.. నేను త‌లుపుచెక్క‌తో అంటా!!- ఇదీ… ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య తాజాగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌. ఇటీవ‌ల కాలంలో ఎడ మొహం.. పెడ‌మొహంగా ఉంటున్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య సామ‌ర‌స్యం చేకూరుతుంద‌ని.. అంద‌రూ అనుకుంటున్న నేప‌థ్యంలో మ‌రోసారి ఇరు రాష్ట్రాల మ‌ధ్య భ‌గ్గున అగ్గి రాజుకుంది. తాజాగా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక త‌ర్వాత‌.. కేంద్రంపై ఒంటి కాలిపై విరుచుకు ప‌డుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. బీజేపీ స‌ర్కారుపై యుద్ధానికి దిగారు. రైతుల ప్ర‌యోజ‌నాలు కేంద్రంలోని మోడీకి ప‌ట్ట‌డం లేద‌ని.. ఇటీవ‌ల ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఇక‌, దేశంలో అగ్గి పెడ‌తానంటూ.. కామెంట్లు కుమ్మ‌రించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా శుక్ర‌వారం.. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు రంగంలోకి దిగింది. మంత్రులు, నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా.. ధ‌ర్నాలు చేప‌ట్టారు. ఇక‌, అధినేతే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాక‌.. కాద‌నే వారు ఎవ‌రు ఉంటారు..? అనుకున్నారో.. ఏమో.. తెలంగాణ మంత్రులు.. నోటికి ప‌ని చెప్పారు. కేంద్రంపై విరుచుకు ప‌డ్డారు. ముఖ్యంగా.. పీఎం న‌రేంద్ర‌మోడీపైనా.. ఆయ‌న విధానాల‌పైనా కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. ఈ క్ర‌మంలో.. తెలంగాణ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి.. నోరు జారేశారు.

తెలంగాణ మంత్రి కామెంట్‌..

అధికార పార్టీ తలపెట్టిన రైతుల ధర్నా కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అనూహ్యంగా ఏపీ గురించిన ప్ర‌స్తావ‌న చేశారు. నిధులు లేక ఆంధ్రా సీఎం జగన్‌ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని, తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని త‌మ‌ను ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ రోజు జగన్‌ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అందుకే మోటార్లకు మీటర్లు పెడుతున్నారని విమర్శించారు. నిధులు లేక జగన్‌ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఎద్దేవాచేశారు. ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలన్నారు. కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో రైతులు మోటార్లకు మీటర్లు పెట్టారని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు.

ఏపీ మంత్రి కౌంట‌ర్‌!!

అంతే! ఇంకేముంది.. ఏపీ నుంచి వెంట‌నే రియాక్ష‌న్ వ‌చ్చేసింది. ధిక్కార‌మున్ సైతువా! అంటూ.. ఏపీ మంత్రి.. పేర్ని నాని.. తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌రింత ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో విరుచుకు ప‌డ్డారు. “ఏపీ ప్ర‌భుత్వం కేంద్రం వ‌ద్ద బిచ్చ‌మెత్తుకుంటోంద‌ని.. మ‌రైతే.. ప‌దే ప‌దే.. ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్‌.. అక్క‌డ ఏం చేస్తున్నారు?” అని నాని నిల‌దీశారు. అంతేకాదు.. బ‌య‌ట కాల‌ర్ ఎగ‌రేసి.. లోప‌ల కాళ్లు ప‌ట్టుకునే ప‌రిస్థితి ఏపీ సీఎం జ‌గ‌న్‌కు లేద‌ని అన్నారు. ఎవ‌రితో అయినా.. ఢీ అంటే.. ఢీ అనే రేంజ్‌లోనే ముందుకు సాగుతార‌ని.. తెలిపారు.

ఇదే స‌మ‌యంలో.. తెలంగాణ ప్ర‌భుత్వంపై మ‌రింత ప‌దునైన వ్యాఖ్య‌లే చేశారు. “ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వ‌ర్గాలు, ప్రాంతాల ప్ర‌జ‌ల నిధుల‌తో అభివృద్ధి చేసిన‌.. హైద‌రాబాద్ నుంచి వ‌స్తున్న సొమ్మును అనుభ‌విస్తారు” అని కేసీఆర్ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేంద్రంపై కోపంతో తెలంగాణ దాయాది రాష్ట్రంతో చిచ్చుపెట్టుకునేలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి కామెంట్లు చేస్తే.. మున్ముందు.. ప‌రిణామాలు మ‌రింత జ‌ఠిల‌మ‌య్యే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీలకులు.