డీఎస్ తో ఈటల భేటీ..


తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ డి. శ్రీనివాస్ తో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈటలను డీఎస్ వద్దకు ఆయన తనయుడు ఎంపీ అర్వింద్ తీసుకెళ్లారు. ఈటల, డీఎస్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అదేమీ లేదని ఈటల సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని మర్యాద పూర్వకంగా కలిశారని చెబుతున్నారు.

గత కొంతకాలంగా డీఎస్ టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఈ భేటీ అటు టీఆర్ఎస్ లో ఇటు బీజేపీలో హాట్ టాఫిక్ అయింది. డీఎస్ ను బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఈటల భేటీ అయ్యారనే చర్చ కూడా సాగుతోంది. గతంలో టీఆర్ఎస్ కు ఈటల రాజీనామా చేసిన తర్వాత కూడా డీఎస్ తో భేటీ అయ్యారు. తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఈటల కోరారు. అప్పుడు అర్వింద్ ను కూడా ఈటల కలిసి మాట్లాడారు.

ఇది ఇలావుంటే డీఎస్ ను తిరిగి సొంత గూటికి అంటే కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. డీఎస్ తో రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌ భేటీ అయ్యారు. అయితే పేరుకు టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడే అయినా.. డీఎస్ ఆ పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి డీఎస్ ఎగుదల అంతా కాంగ్రెస్ లోనే సాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఈ తర్వాత డీఎస్ ను కేసీఆర్ రాజ్యసభకు పంపారు. అయితే కొంత కాలానికే కేసీఆర్‌, డీఎస్ మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి డీఎస్ తో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ లో రేపో మాపో చేరబోతున్నారనే సమయంలోనే ఈటల, డీఎస్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయనను బీజేపీలో చేర్చుకునేందుకే ఈటల కలిశారని చెబుతున్నారు. అయితే ఇప్పుడు బంతి మాత్రం డీఎస్ కోర్టులో ఉంది. ఆయన సొంత గూటికే చేరుకుంటారో.. లేక తనయుడు మార్గంలో పయనిస్తారో కాలమే నిర్ణయించాలి.