బుట్టాకు భాగ్యం.. ద‌క్కేనా… తాడేప‌ల్లిలోనే మకాం…!


బుట్టా రేణుక‌. క‌ర్నూలు మాజీ ఎంపీ. వైసీపీ నాయ‌కురాలు. ఒక్క చిన్న పొర‌పాటు కార‌ణంగా.. రాజ‌కీయాల్లో తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌రిస్థితి ఎదుర్కొంటున్న ఆమె.. ఇప్పుడు మ‌రోసారి.. సీఎం జ‌గ‌న్ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. గ‌త 2014లో ఎంపీగా గెలిచిన రేణుక‌.. 2017లో టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. నేరుగా పార్టీలోకి చేర‌క‌పోయినా.. చంద్ర‌బాబు చేస్తున్న అభివృద్ధి ప‌ట్ల ముగ్ధురాలైన‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ విధానాల‌కు భిన్నంగా.. టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు.. ఆమె ఆశించిన అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ నిరాక‌రించ‌డంతో.. తిరిగి వైసీపీ గూటికే రివ‌ర్స్ జంప్ చేశారు.

అయితే.. అప్ప‌ట్లో వైసీపీ కూడా ఆమెకు టికెట్ ఇవ్వ‌లేదు. అయినా ప్ర‌భుత్వం వ‌స్తే.. ఏదైనా గౌర‌వ ప్ర‌ద‌మైన ప‌ద‌విని ఇస్తామ‌ని.. జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్టు అప్ప‌ట్లో ఆమె ప్ర‌చారం చేసుకున్నారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌చారం చేసి పెట్టారు. కానీ, పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు రేణుక‌కు ఎలాంటి ప‌ద‌వీ ద‌క్క‌లేదు. కొన్నాళ్ల కింద‌ట‌.. రాజ్య‌స‌భ కోసం ప‌ట్టుబ‌ట్టార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అప్ప‌ట్లోనూ ఆమె తాడేప‌ల్లి వ‌ర‌కు రావ‌డం.. మీడియా కంట ప‌డ‌కుండా.. త‌ప్పించుకోవ‌డం.. వార్త‌ల్లోకి వ‌చ్చాయి. మ‌రి ఏం జ‌రిగిందో.. ఏమో అప్ప‌టి నుంచి మౌనంగానే ఉన్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి బుట్టా రేణుక వార్త‌ల్లో నిలిచారు.

తాజాగా ఆమె తాడేప‌ల్లి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న‌కు ఎమ్మెల్సీ అయినా.. ఇవ్వాల‌ని ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ప‌దవులు లేక పోవ‌డంతో.. రేణుక‌ను ప‌ట్టించుకునే వారు లేర‌నేది.. అంద‌రికీ తెలిసిన విష‌యమే. అంతేకాదు.. ఆమెను క‌ర్నూలు ఎంపీనే దూరం పెడుతున్నార‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా ఉంది. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా పిల‌వ‌డం లేదు. దీనికి కార‌ణం.. పార్టీలో త‌న‌కు ఎలాంటి గుర్తింపు లేక‌పోవ‌డమేన‌ని భావించిన రేణుక‌.. ఇప్పుడు చాలా సీరియ‌స్‌గా ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే కొంద‌రి ద్వారా.. ఆమె సిఫార‌సు కూడా చేయించుకున్నార‌ని.. తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ అప్పాయింట్ మెంట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. రెండు రోజులుగా గుంటూరులోనే ఉంటున్నార‌ని.. వైసీపీ నాయ‌కులు గుస‌గుస‌లాడుతు న్నారు. మ‌రి ఈ ప‌రిణామాల‌తో అయితే.. సీఎం జ‌గ‌న్ క‌రుణిస్తారా? ఆమె ఒక ఛాన్స్ ఇస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం క‌ర్నూలు నుంచి పెద్ద‌గా పోటీ లేక‌పోవ‌డంతోపాటు.. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డం.. ప్ల‌స్‌గా మారింది. అయితే.. చివ‌రికి స‌మీక‌ర‌ణ‌లు మారితే.. తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికైతే.. బుట్టాకు ఛాన్స్ ఉంద‌ని సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.