కేంద్రంతో ఢీ.. కేసీఆర్ ఫైర్‌!

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢీ అంటే ఢీ అంటూ.. ఆయ‌న స‌వాళ్లు రువ్వారు.. టార్గెట్లు పెట్టారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తూ.. ఊరుకున్నామ‌ని.. ఇక‌పై.. కొట్లాటే షురూ! అని ప్ర‌క‌ట‌న చేశారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌పై నిప్పులు చెరిగారు. కేంద్రం అన్ని విధాలా ఈ దేశాన్ని నాశ‌నం చేస్తోంద‌న్న కేసీఆర్.. రైతులు.. ప్ర‌జ‌లు.. సామాన్యుల వ‌ర‌కు మోసం చేస్తూ.. ఆ త‌ప్పుల‌ను రాష్ట్రాల‌పైకి నెడుతోంద‌ని నిప్పులు చెరిగారు. ఇప్ప‌టి వ‌ర‌కు తాము కొట్లాట ఎందుకులే.. అని ఊరుకున్నామ‌ని..కానీ, ఇక నుంచి తాము కూడా రోడ్డెక్కుతామ‌ని.. స్ప‌ష్టం చేశారు. బీజేపీపై స‌మ‌ర‌మే.. అని స్ప‌ష్టం చేశారు.

ఈ క్ర‌మంలో కేసీఆర్‌.. కేంద్రానికి మూడు టార్గెట్లు పెట్టారు. రైతులు వ్య‌తిరేకిస్తున్న నూత‌న సాగు చ‌ట్టాల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని.. కేసీఆర్ కేంద్రానికి స్ప‌ష్టం చేశారు. అదేస‌మ‌యంలో ధాన్యం సేక‌ర‌ణ విష‌యంలో రాష్ట్రాల‌కు పెడుతున్న అడ్డంకులు తొల‌గించాల‌న్నారు. పెట్రోలు డీజిల్‌పై విధించిన సెస్సును పూర్తిగా ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ‘2014 లో క్రూడాయిల్ ధ‌ర 105 డాల‌ర్లు. ఇప్పుడు 82 డాల‌ర్లే ఉంది. పెట్రోల్ ధ‌ర‌ల‌పై కేంద్రం అబ‌ద్ధ‌మాడింది. అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ ధ‌ర‌లు పెరిగాయ‌ని బీజేపీ నేత‌లు అబ‌ద్ధాలు చెబుతున్నారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఏ ఒక్క రోజూ.. క్రూడాయిల్ ధ‌ర 105 డాల‌ర్లు లేదు. ధ‌ర‌లు పెంచే మార్గం ఆపి.. సెస్సులు పెంచుతున్నారు. వీటిని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.

అంతేకాదు. ఇక‌పై.. కేంద్రం తీసుకువ‌చ్చే అన్ని చ‌ట్టాల్లోనూ ప్ర‌జ‌ల వ్య‌తిరేకత ఉంటే.. తాముకూడా పోరాటాలు చేస్తామ‌న్నారు. కేంద్రంలో పెద్ద‌లు ఒక‌ర‌కంగా ఉంటే.. రాష్ట్రంలో బీజేపీ సిల్లీ నేత‌లు మ‌రో విధంగా ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తి విష‌యంలోనూ ఇక‌పై ఊరుకునేది లేద‌ని.. తాము ఉద్య‌మాల నుంచే పుట్టామ‌ని.. ఉద్య‌మాలు త‌మ‌కు కొత్త‌కాద‌ని..కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై తాము గ‌ళం వినిపిస్తామ‌ని చెప్పారు. అన్ని విష‌యాల్లోనూ కేంద్రం తెలంగాణ‌కు అన్యాయం చేస్తోంద‌ని నిప్పులు చెరిగారు. దీనిపై వాడ‌వాడ‌లా తాము ప్ర‌జ‌ల‌ను చైతన్య‌ప‌రుస్తామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విభ‌జ‌న హామీల‌ను కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు. 157 కాలేజీలు దేశ‌వ్యాప్తంగా మంజూరు చేస్తే..ఒక్క‌టి కూడా తెలంగాణ కు ఇవ్వ‌క‌పోవ‌డాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను.. చూస్తే.. కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి రెడీ అవుతున్నార‌నే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.