బాలయ్య తెలుగుదేశం పగ్గాలెందుకు తీసుకోలేదంటే?

అమితాసక్తిని రేకెత్తించిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో స్ట్రీమింగ్ మొదలైపోయింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా రూపొందుతున్న ఈ షోను ఆహా ప్రొడ్యూస్ చేసింది. దీపావళి కానుకగా ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమైంది. తొలి అతిథులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి వచ్చారు. ముందు ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసినపుడే ప్రకంపనలు రేగాయి. బాలయ్య-మోహన్ బాబుల సంభాషణ.. ఒకరికొకరు వేసుకున్న ప్రశ్నలు ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. ఆ ప్రోమోలో అందరినీ ఎంతో ఆకర్షించిన ఓ ప్రశ్న.. నందమూరి తారక రామారావు తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చావు? అన్నదే. ఈ ప్రశ్నకు బాలయ్య ఏం సమాధానం చెబుతాడా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. దీనికి బాలయ్య ఇచ్చిన సమాధానం ఏమంటే…?

‘‘మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకంగా. ఆ టైంలో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అంటూ వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం కూాడ ేచసింది. నాన్న గారు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. అలాంటిది మనమే పెద్దాయన తర్వాత మేమే పగ్గాలు తీసుకుంటే ఏం బాగుంటుంది? మేం వారసత్వ రాజకీయాలు చేస్తే బాగుండదనే నేను పగ్గాలు తీసుకోలేదు. చంద్రబాబు గారు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి. ఆయన కాలేజీ, గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుంచి అన్నీ చూసి వచ్చిన మనషి. ఆయన కాబట్టే ఆ బాధ్యతలు అంత బాగా నిర్వర్తించగలిగాడు. అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగాడు’’ అని బాలయ్య వివరించాడు. ఐతే తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని పగ్గాలందుకోని బాలయ్య.. ఇప్పుడు చంద్రబాబు వారసుడిగా ఆయన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా అడుగులేస్తున్న లోకేష్‌ను ఎలా సమర్థిస్తున్నారంటూ కౌంటర్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో.