మోడీకి అమెరికా షాక్

పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగం ఆరోపణలపై ఉక్కిరిబిక్కిరి అవుతున్న నరేంద్ర మోడీకి అమెరికా పెద్ద షాకే ఇచ్చింది. తమ దేశంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ కారణంగా మానవ హక్కులకు భంగం కలుగుతున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ఓ ప్రకటనలో స్పష్టంగా చెప్పింది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా జర్నలిస్టులు, ప్రతిపక్షాల నేతలు, జడ్జీలు, ఇతర రంగాల్లో నిపుణులు, సామాజిక హక్కుల కార్యకర్తలపై దాదాపు 50 దేశాల్లో పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి వాళ్ళ మొబైల్ ఫోన్ లను ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఈ సాఫ్ట్ వేర్ వినియోగంపై అమెరికా సహా అనేక దేశాల్లో పెద్ద దుమారమే రేగుతోంది. సరిగ్గా ఇలాంటి ఆరోపణలే నరేంద్ర మోడి సర్కార్ మీద కూడా మొదలైంది. ప్రతిపక్షాల ఆరోపణలకు మోడీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పలేకపోవటంతో పోయినసారి పార్లమెంటు సమావేశాలు మొత్తం ఈ గొడవతోనే సరిపోయింది. దీంతో కొందరు జర్నలిస్టులు సుప్రింకోర్టులో కేసులు వేశారు. కేసు విచారణ మొదలుపెట్టిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులిస్తే సరైన సమాధానం చెప్పలేదు.

కేంద్రానికి ఎంత గడువిచ్చినా ఉపయోగం లేకపోవటంతో చివరకు చేసేది లేక పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై సుప్రీంకోర్టు సొంతంగా నిపుణుల కమిటిని నియమించింది. ఈ కమిటి వేయటం నిజానికి కేంద్రానికి ఏమాత్రం ఇష్టంలేదని అర్ధమవుతునే ఉంది. అయినా చేసేదేమీ లేక మాట్లాడకుండా కూర్చున్నది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై నిషేధం విధించడం మోడీ సర్కార్ కు చాలా ఇబ్బందిగా మారింది.

ఒకవైపు అమెరికా సాఫ్ట్ వేర్ వినియోగాన్ని నిషేధించటం, ఇదే సమయంలో సుప్రీంకోర్టు నియమించిన స్వతంత్ర కమిటీ విచారణ మొదలుపెట్టడంతో మోడి సర్కార్ కు ఇబ్బందులు మొదలైనట్లే. ఎందుకంటే ఈ కమిటి తన దర్యాప్తులో భాగంగా హోంశాఖ, విదేశాంగ శాఖ, రక్షణ వ్యవహారాల శాఖల ఉన్నతాధికారులను విచారించనున్నది. పైగా ఇదే సమయంలో 50 దేశాల్లో సాఫ్ట్ వేర్ వినియోగంపై పెద్ద దుమారం రేగటమంటే మామూలు విషయం కాదు.

సాఫ్ట్ వేర్ ను ఇండియాలో వినియోగిస్తున్నట్లు కేంద్రం స్పష్టంగా అంగీకరించకపోయినా సాఫ్ట్ వేర్ వినియోగిస్తున్నట్లు పరోక్షంగా అంగీకరించినట్లే. ఎందుకంటే కొందరు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ తో పాటు నిపుణుల పర్యవేక్షణలో నిరూపణైంది. దీంతో స్వతంత్ర కమిటీ దర్యాప్తులో కూడా కొద్దిరోజుల తర్వాత ఇదే విషయం బయటపడటం ఖాయం. అప్పుడు ప్రతిపక్షాలతో పాటు దేశ ప్రజలకు మోడి ఏమని సమాధానం చెప్పుకుంటారో చూడాలి.