ఎంపీలకు ఉచిత విమాన ప్రయాణం బంద్

ఒక్కసారి ఎంపీ అయితే చాలు ఎన్నో సౌకర్యాలు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలోని అనేక వ్యవస్ధల్లో ఎంపీలకు అపరిమితమైన సౌకర్యాలుంటాయి. టెలిఫోన్ల కేటాయింపు, బిల్లుల చెల్లింపు, విమాన, రైల్ ప్రయాణాలు ఉచితం, లేదా రాయితీలు ఇలా అనేక సౌకర్యాలుంటాయి. అయితే ఇపుడు అలాంటి సౌకర్యాల్లో కొన్నింటిపై వేటుపడింది. ఇప్పటివరకు విమానాల్లో ఉచితంగా ప్రయాణాలు చేస్తున్న ఎంపీలు ఇకనుండి టికెట్లు కొనుక్కుని ప్రయాణం చేయకతప్పదు.

ఎందుకంటే ఇప్పటివరకు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్ ఇండియా ప్రైవేటుపరం అయిపోయింది కాబట్టే. వేలం పాటలో ఎయిర్ ఇండియాను టాటా సన్స్ అండ్ కంపెనీ సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎయిర్ ఇండియా టాటల సొంతం అయిపోయిందో వెంటనే ఎంపీల విమానప్రయాణాల సౌకర్యాన్ని కట్ చేసేశారు. తాజా నిర్ణయం ప్రకారం ఎంపీలు తమ డబ్బులతో టికెట్లు కొనుగోలు చేసి తర్వాత పార్లమెంటు సచివాలయానికి రీఎంబర్స్ మెంటుకు దరఖాస్తు చేసుకోవాలి.

అలాగే కేంద్రియ విద్యాలయాల్లో ఎంపీలకు 10 శాతం రిజర్వేన్ ఉండేది. ఇది సరిపోకపోతే కేంద్రమంత్రి విచక్షణతో ఎంపీలు మరిన్ని సీట్లను తీసుకునేవారు. ఇపుడు ఆ రిజర్వేషన్ ప్రక్రియను కూడా కేంద్రం రద్దుచేసేసింది. మరి కేంద్రియ విద్యాలయాల సీట్లలో ఎంపీల కోటాను కేంద్రం ఎందుకు రద్దుచేసిందో తెలియటంలేదు. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ ఫండ్లను కూడా నిలిపేసింది. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఏటా ప్రతి ఎంపీకి కేంద్రం రు. 5 కోట్లను మంజూరు చేస్తోంది.

అయితే కొన్ని చోట్ల ఈ ఫండ్స్ దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. దాంతో హోలు మొత్తంగా ఫండ్స్ రిలీజ్ ను కేంద్రం ఫ్రీజ్ చేసేసింది. ఇప్పటికే పార్లమెంటు క్యాంటిన్ లో దొరికే ఆహారం ధరలు బాగా పెంచేసిన విషయం తెలిసిందే. ఇక మళ్ళీ ఎయిర్ ఇండియా విషయానికి వస్తే ఎప్పుడైతే ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిందో అప్పటినుండే నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.

సమయాన్ని పాటించకపోవటం, రాయితీలను ఇష్టం వచ్చినట్లు ఇచ్చేయటం, చివరి నిముషంలో విమానాలను రద్దుచేసినా ప్రయాణీలకు సరైన సమాచారం ఇవ్వకపోవటం లాంటి అనేక అవకతవకలు జరిగాయి. కేంద్రమంత్రులు, ఎంపీల కోసం విమానాలను గంటపాటు నిలిపేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అదే అంతకుముందు కచ్చితమైన ప్రయాణ సమాయాన్ని పాటించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏదేమైనా ఎంపీల సౌకర్యాల్లో కోతలు అయితే మొదలయ్యాయి. ముందు ముందు ఇంకెన్ని కోతలు పడతాయో చూడాల్సిందే.