ష‌ర్మిల‌కు కేసీఆరే అస్త్రాలు ఇస్తున్నారా?

ఔను! ఇప్పుడు ఈ మాటే తెలంగాణ స‌హా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా వైఎస్ త‌న‌య‌ ష‌ర్మిల పెట్టిన పార్టీవైపు క‌న్నెత్తి చూడ‌ని నాయ‌కులు.. ఆమె గురించిపెద్ద‌గా ప‌ట్టించుకోని వారు కూడా ఇప్పుడు.. సానుభూతి చూపించే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆమె వైపు.. ఆలోచించే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనికి కార‌ణం.. కేసీఆర్ మంత్రివ‌ర్గంలోని అమాత్యుడు..నిరంజ‌న్‌రెడ్డి, పోలీసు శాఖే అని అంటున్నారు ప‌రిశీల‌కు లు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆరే.. స్వ‌యంగా ష‌ర్మిల‌కు అస్త్రాలు అందిస్తున్నారని చెబుతున్నారు. ఏ రాజ‌కీయ పార్టీకైనా.. సానుభూతిని మించిన అస్త్రం మ‌రొక‌టి లేదు.

సానుభూతితోనే కేసీఆర్ అయినా.. మ‌రెవ‌రైనా సీఎం పీఠాలు ఎక్కుతున్న‌ద‌నే విష‌యాన్ని టీఆర్ ఎస్ గుర్తించాల‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్పుడు అదే సానుభూతి ప‌వ‌నాలు ష‌ర్మిలవైపు తిరిగే అవ‌కాశాన్ని అధికార పార్టీ చేజేతులా చేస్తోంద‌ని.. చెబుతున్నారు. కొన్నాళ్ల ఇంద‌ట ఇందిరా పార్క్ వ‌ద్ద నిరుద్యోగ దీక్ష చేప‌ట్టిన ష‌ర్మిలను అక్క‌డ నుంచి పంపించే క్ర‌మంలో పోలీసులు లాగిప‌డేశార‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఆమె చీర చిరిగిపోయింది. అంతేకాదు.. మ‌హిళా పోలీసుల‌కు బ‌దులు.. పురుష పోలీసులే ఆమెను లాగేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

దీనిని రాజ‌కీయంగా ఆమె వాడుకోక‌పోయినా.. మ‌హిళా సంఘాలు ఖండించాయి. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే సీత‌క్క‌.. ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయాల‌కు అతీతంగా ఖండిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ విష‌యం ఇంకా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా కొన‌సాగుతోంది. ఇంత‌లోనే.. కేసీఆర్ మంత్రి వ‌ర్గంలోని నిరంజ‌న్ రెడ్డి హ‌ద్దులు దాటేశారు. నోటికి ఎంత మాట వ‌స్తే.. అంత‌మాట అనేశారు. మంగ‌ళ‌వారం మ‌ర‌ద‌లు అంటూ.. ష‌ర్మిల‌ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌హిళా సంఘాలు మ‌రింతగా ఖండిస్తున్నాయి.

‘‘రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలని దీక్షలు చేస్తానంటూ మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నిరంజన్‌ రెడ్డి బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పందించారు.

ఉద్యోగాలు త్వరగా భర్తీ చేయాలనే ఆమె డిమాండ్‌ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని మంత్రి ఆరోపించారు. ఆరోప‌ణ‌ల వ‌ర‌కు ఎవ‌రైనా రాజ‌కీయాలు చేయొచ్చు.. కానీ.. పురుష నాయ‌కుల‌ను తిట్టిన‌ట్టు.. ఇటీవ‌ల కాలంలో లింగారెడ్డి కూడా రేవంత్ స‌హా.. బండి సంజ‌య్‌పై తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు. ఇప్పుడు నిరంజ‌న్ రెడ్డి ఏకంగా.. ష‌ర్మిల‌పై నోరు పారేసుకున్నారు. మ‌రి ఇదే పంథా కొన‌సాగితే.. సానుభూతి ష‌ర్మిల వైపు మ‌ళ్లితే.. మ‌హిళా ఓటు బ్యాంకు దూర‌మైతే.. ఏం జ‌రుగుతుంది? అనేది ప‌రిశీల‌కుల ప్ర‌శ్న‌. అంతేకాదు.. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌ను ఇలా కించ‌ప‌రుస్తారా? అనే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తుండ‌డం కేసీఆర్ కు వినిపించ‌క‌పోయినా.. స‌మాజానికి అర్ధ‌మ‌వుతోంద‌ని అంటున్నారు.