డామిట్ … కథ అడ్డం తిరిగిందా?

రాజ‌కీయాల్లో చ‌ర్చ‌లు, అంచ‌నాలు.. విశ్లేష‌ణ‌లు.. విమ‌ర్శ‌లు కామ‌న్‌. అయితే.. ఒక్కొక్క‌సారి అనుకున్న విధంగా.. ఈ విశ్లేష‌ణ‌లు.. ముందుకు సాగ‌క‌పోతే.. పెద్ద ఎత్తున దెబ్బ త‌గ‌ల‌డం ఖాయం. ఇప్పుడు ఇదే అంశం టీడీపీలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. టీడీపీ మంచికోసం.. లేదా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీని అధికారంలోకి రాకుండా.. వైసీపీ ఎలా అడ్డుకుంటోంద‌నే విష‌యాన్ని చెప్ప‌డం కోసం.. తాజాగా టీడీపీ నేత‌లు ఓ విశ్లేష‌ణ చేశారు. అదేంటంటే.. వైసీపీ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిషోర్‌.. టీడీపీని అధికారంలోకి రానీయ‌కుండా.. అడ్డుకునేందుకు చంద్ర‌బాబు వ‌య‌సును.. ఆయ‌న వృద్ధాప్యాన్ని అస్త్రంగా చేసుకున్నార‌ని.. అన్నారు.

త‌మ‌కు(టీడీపీ సీనియ‌ర్లు) అందిన అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు.. ప్ర‌శాంత్ కిశోర్‌.. బృందం.. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు.. ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో టీడీపీలో నెంబ‌రు 2 నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. సీఎం అవుతార‌ని.. ప్ర‌శాంత్ కిశోర్‌.. ప్ర‌చారం చేయించ‌నున్న‌ట్టు.. కూడా సీనియ‌ర్లు అంచ‌నావేశారు. మ‌రిదీనికి వారు సంపాయించుకున్న స‌మాచారం ఏంటో తెలియ‌దు కానీ.. గుస‌గుస మాత్రం మొద‌లు పెట్టేశారు. దీనికి టీడీపీపై ఉన్న అభిమానంతో కావొచ్చు.. చంద్ర‌బాబుకు డ్యామేజీ జ‌రిగితే.. చూడ‌లేని వారు కావొచ్చు.. వైసీపీ వ్యూహ‌క‌ర్త ఇలా చేస్తున్నాడు అంటూ.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు.

అదే స‌మ‌యంలో మ‌ళ్లీ మ‌ళ్లీ చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రి అవుతార‌ని.. స‌ద‌రు వ్య‌క్తులు.. నొక్కి వ‌క్కాణించారు. అంతేకాదు.. ప‌రోక్షంగా.. ప్ర‌త్య‌క్షంగా.. లోకేష్‌.. ఇప్ప‌ట్లో ముఖ్య‌మంత్రి కాడ‌ని.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. అయితే.. ఇది.. అనుకున్న విధంగా ప్ర‌చారం జ‌రగ‌లేదు. యాంటీ యాంగిల్ తీసుకుంది. లోకేష్‌ పై ఇప్పటికే ఉన్న కొన్ని విమ‌ర్శ‌ల‌కు ఇది ప్ర‌ధాన అస్త్రంగా మారిపోయింది. దీంతో అప్పుడే..వైసీపీ మంత్రులు.. కొంద‌రు జంపింగ్ ఎమ్మెల్యేలు.. లోకేష్‌ పై ట్రోల్స్ మొద‌లు పెట్టేశారు. తాము ముందే చెప్పామ‌ని.. లోకేష్ పార్టీకి బ‌ర‌వని.. వ్యాఖ్యానాలు సంధించారు. దీంతో అనుకున్న మైలేజీ రాక‌పోగా.. చంద్ర‌బాబు ఇమేజ్ పేరుతో.. లోకేష్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌ష్ట‌ప‌డి సంపాయించుకున్న ఇమేజ్‌కు డ్యామేజీ ఏర్ప‌డింది.

వాస్త‌వానికి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వృద్ధుడ‌ని.. ఆయ‌న విశ్రాంతి తీసుకునే వ‌య‌సులోనూ..రాష్ట్రానికి సేవ చేస్తున్నార‌ని.. ఎవ‌రో వ‌చ్చి.. ఈ ప్ర‌జ‌ల‌కు.. చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఈ విశ్లేష‌ణ‌ చూసిన విమ‌ర్శ‌కులు అంటున్నారు. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడే.. తాను 70 ఏళ్ల వ‌య‌సులోనూ.. రోజుకు 18 గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని.. త‌న కుటుంబాన్ని హైద‌రాబాద్‌లో వ‌దిలేసి వ‌చ్చాన‌ని, మ‌న‌వ‌డిని చూడాల‌ని అనుకున్నా.. వెళ్ళ‌లేక పోతున్నాన‌ని.. స్వ‌యంగా చెప్పుకొన్నారు. అంతేకాదు.. ఈ వ‌య‌సులో త‌న‌కు ఏం త‌క్కువ‌ని.. విశ్రాంతి తీసుకోవ‌చ్చుక‌దా! అని త‌న‌కు త‌నే స్వ‌యంగా ప్ర‌శ్నించుకున్నారు. సో.. ఇవ‌న్నీ.. ఏ వైసీపీ నాయ‌కులో.. వ్యూహ‌క‌ర్త‌లో చంద్ర‌బాబు గురించి ప్ర‌చారం చేయ‌లేదు. కానీ, ఇప్పుడు ప‌నిగ‌ట్టుకుని విశ్లేష‌ణ‌లు చేయ‌డం.. చంద్ర‌బాబు పై ప్రేమ‌తోనే అయినా.. అవి యాంటీ ప్ర‌చారానికి దారితీశాయ‌ని.. టీడీపీలో మ‌రోవ‌ర్గం త‌ల‌ప‌ట్టుకుంది. మ‌రి ఈ డ్యామేజీకి ఎవ‌రు కాయ‌క‌ల్ప చికిత్స చేస్తారో చూడాలి.