టీఆర్ఎస్ ప్లీన‌రీ – కేటీఆర్ పై సెటైర్లు

తెలంగాణ అధికార పార్టీ మూడేళ్ల త‌ర్వాత‌.. ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీపై సోష‌ల్ మీడియాలో స‌టైర్లు పేలుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ మొత్తం కూడా గులాబీ మ‌యం అయిపోయిన విధానంపై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఎటు చూసినా గులాబీ వ‌ర్ణంలో ఉన్న ఫ్లెక్సీలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. హైద‌రాబాద్‌లోని హెటెక్స్‌లో నిర్వ‌హిస్తున్న ప్లీన‌రీని పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఈ క్ర‌మంలో న‌గ‌రం స‌హా.. చుట్టుప‌క్కల జిల్లాల్లోనూ భారీ ఎత్తున కేసీఆర్ క‌టౌట్లు.. పార్టీ జెండాల‌ను ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలో ఇదేం వింత అంటూ.. నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

అదేస‌మ‌యంలో గ‌తంలో కేసీఆర్ ఈ క‌టౌట్ల హంగామా గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా వారు గు్ర్తు చేస్తున్నారు. “రాజకీయ నాయకులు తమ ముఖాలను తామే చూసుకోవడానికే ఫ్లెక్సీలు పనికొస్తాయి. ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన లీడర్స్‌ కారు. ప్లాస్టిక్‌ అనేది భూతం. అది మనల్ని వెంటాడుతుంది. దానిపై యుద్ధం చేయాలి. ఫ్లెక్సీలు పెట్టడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. వాటిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెట్టినా సరే! ఫ్లెక్సీ పెట్టినందుకు మీ (ఇల్లందు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌)కు రూ.లక్ష ఫైన్‌ వేస్తున్నా” అని గత ఏడాది మార్చి 2న ఇల్లందు పర్యటన సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను నెటిజ‌న్లు ప్ర‌స్తావిస్తున్నారు.

తర్వాత కూడా పలుమార్లు ఫ్లెక్సీలపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీల వాడకం చాలా పెరిగిపోయిందని, ఈ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించాలని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పర్యటనకు వెళ్లిన సందర్భంలోనూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పలువురు కార్పొరేటర్లకు జరిమానా వేయాలని పలుమార్లు ఆదేశించారు. “కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. జనవరి ఒకటి నుంచి నగరంలో గోడలపై రాతలు; ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు కనిపిస్తే పబ్లిక్‌ డీఫే్‌సమెంట్‌ యాక్ట్‌ను కచ్చితంగా అమలు చేస్తాం. ఉల్లంఘనకు పాల్పడితే అధికార పక్షం వారినీ వదలం” అని అధికారులకు తేల్చి చెప్పారు.

కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా అడుగ‌డుగునా.. ఫ్లెక్సీలు పెట్టారు. రోడ్డుకు ఇరు వైపులా అంగుళం అంత గ్యాప్ లేకుండా.. పార్టీ జెండాలు క‌ట్టారు. దీంతో నాటి సుద్దులు ఇప్పుడు ఏమ‌య్యాయంటూ.. నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఎక్క‌డా కూడా చోటా నేత‌ల‌ను కానీ.. క‌నీసం సీఎం త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌ను హైలెట్ చేయ‌కుండా..కేవ‌లం కేసీఆర్‌ను ముఖ్యంగా తీసుకుని ఈ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. దీనిపై రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో తానే పెద్ద‌దిక్కుగా ఉంటాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేస్తున్నారా? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.