బాబు ఢిల్లీ టూర్‌పై వైసీపీ బెంగ‌

చంద్ర‌బాబు ఢిల్లీ టూర్‌పై వైసీపీ నాయ‌కులు బెంగి పెట్టకున్నారా? సుదీర్ఘ కాలం విరామం త‌ర్వాత‌.. ఢిల్లీ వెళ్తున్న చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌భుత్వంపై ఏం చెబుతారో.. ఏం జ‌రుగుతుందో.. అని త‌ల్ల‌డిల్లుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్తున్న విష‌యం తెలిసిందే. ముందుగానే ఆయ‌న 36 పేజీల‌తో కూడిన లేఖ‌ల‌ను.. ఆయ‌న సంధించారు. ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. స‌హా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద‌ద్‌కు కూడా చంద్ర‌బాబు లేఖ‌లు రాశారు. రాష్ట్రంలో త‌మ పార్టీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని ఆయ‌న వివ‌రించారు.

అదేస‌మ‌యంలో గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప్ర‌భుత్వ పాల‌న‌.. పోలీసుల తీరు.. స‌హా.. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు డీజీపీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. పోలీసులు ఎప్పుడు వ‌చ్చారు.. ఇలా అనే విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే.. మోడీ అప్పాయింట్ మెంట్ ఖ‌రారు కాలేదు. ఇక‌, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా .. ప్ర‌స్తుతం క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం వ‌ర‌కు అక్క‌డే ఉండ‌నున్నారు. ఈలోగా.. ఆయ‌న ఢిల్లీకి వ‌చ్చి.. చంద్ర‌బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇస్తారో లేదో చూడాలి. ఇక‌, ఢిల్లీ వెళ్తున్న చంద్ర‌బాబుకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌.. అప్పాయింట్‌మెంట్ ఖ‌రారైంది.

రాజ్యాంగ అధినేత అయిన‌.. కోవింద్‌ను క‌లిసి.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చంద్ర‌బాబు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. అంతేకాదు.. దాదాపు ఐదు రోజుల పాటు చంద్ర‌బాబు ఢిల్లీలోనే ఉంటార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల టీడీపీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని వ్య‌తిరేకిస్తూ.. వైసీపిని విమ‌ర్శించిన ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ అప్పాయింట్‌మెంట్ కూడా చంద్ర‌బాబు తీసుకుంటార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మ‌రికొంద‌రు సీనియ‌ర్ల‌ను కూడా ఆయ‌న క‌లుస్తార‌ని.. అంటున్నారు. మొత్తంగా చూస్తే.. డిల్లీ లో చంద్ర‌బాబు త‌న‌కు పాజిటివ్‌గా ఉన్న అన్ని అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

ఇదే ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లానికి దారితీస్తోంది. త‌మ‌పై ఏం చెబుతారో.. త‌మ పాల‌న‌పై ఏం చేస్తారో.. అనే గుబులు వైసీపీలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి క‌న్న‌బాబు.. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. జగన్పై బురద జల్లేందుకే.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని విమర్శించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునే ఉగ్రవాదం టీడీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

మొత్తంగా చూస్తే.. బాబు ప‌ర్య‌ట‌న‌.. వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ంలో అవినీతి జ‌రుగుతోంద‌ని.. కొన్నాళ్లుగా బాబు ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో దీనిపైనా.. ఆయ‌న‌కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచ‌న‌లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇప్పుడు ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి కౌంట‌ర్‌గా జ‌గ‌న్ కూడా ఢిల్లీకి వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.